East Godavari District: తూర్పుగోదావరిలో అర్ధరాత్రి పెను విషాదం.. ఆటో- టిప్పర్ లారీ ఢీ... ఆరుగురు దుర్మరణం!

  • సామర్లకోట శివారులో ప్రమాదం
  • పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘటన
  • మృతుల్లో మూడేళ్ల చిన్నారి

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో సోమవారం అర్ధరాత్రి పెను ప్రమాదం సంభవించింది. పట్టణ శివారులోని సాంబమూర్తి రిజర్వాయరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆటో టిప్పర్-లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కాకినాడలోని రామేశ్వరం గ్రామానికి చెందిన 15 మంది.. పెద్దాపురం మండలం వడ్లమూరులో జరిగిన ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో సాంబమూర్తి రిజర్వాయర్ సమీపంలోని ఐదు తూముల వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ పెంకె రాజు (50), సలాది నాగమణి (35), నొక్కు కమలమ్మ (35), పండు (3)లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News