polavaram: 11న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం ప్రాజెక్ట్ సందర్శన

  • పోలవరం ప్రాజెక్ట్ పనులు 56 శాతం పూర్తి
  • 66వ సారి సీఎం చంద్రబాబు వర్చువల్ సమీక్ష
  • డయాఫ్రం వాల్ కాంక్రీట్ పనులు రికార్డు సమయంలో పూర్తి
  • మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వివరణ

కేంద్ర రోడ్డు రవాణా, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 11న పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. ప్రపంచంలోనే రెండవ అతి పెద్దదయిన పోలవరం ప్రాజెక్ట్ ని నిర్ణయించిన సమయంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 56 శాతం పూర్తయినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 66వ సారి వర్చువల్ సమీక్ష నిర్వహించారు.

అనంతరం మంత్రి ఉమామహేశ్వరరావు సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నిర్మాణం సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. హెడ్ వర్క్స్ 42.16 శాతం, డ్యామ్ ప్రధాన ప్యాకేజీ పనులు 40.65 శాతం, తవ్వకం పనులు 75.80 శాతం, కాంక్రీట్ పనులు 28.40 శాతం, రేడియల్ గేట్ల పనులు 61.30 శాతం, వంద శాతం డయాఫ్రామ వాల్ పనులు, జెట్ గ్రౌంటింగ్ పనులు 90.70 శాతం పూర్తి అయినట్లు వివరించారు.

కుడి ప్రధాన కాలువ పనులు 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 61.67 శాతం, అనుసంధాన ప్యాకేజీ పనులు 58.32 శాతం పూర్తి అయినట్లు చెప్పారు. 1396.6 మీటర్ల డయాఫ్రం వాల్ కాంక్రీట్ పనులు పనులు రికార్డు టైమ్ లో పూర్తి చేసినట్లు తెలిపారు. దిగువ కాపర్ డ్యామ్ పనులు వచ్చే సోమవారానికి పూర్తి అవుతాయన్నారు.

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన తరువాత రూ.8662 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.6727 కోట్లు రీఇంబర్స్ చేసిందని, ఇంకా రూ.1935 కోట్లు రావలసి ఉందని అన్నారు. జూన్ చివరినాటికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కు సంబంధించిన బిల్లులను పోలవరం డెవలప్ మెంట్ అథారిటీకి పంపినట్లు మంత్రి చెప్పారు.

More Telugu News