Pawan Kalyan: ఇలాంటివి ప్రశ్నిస్తే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నానని అంటారా?: బాబుపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం

  • ఎటు చూసినా ఇసుక మాఫియా దోపిడీయే కనిపిస్తోంది
  • ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని ఎందుకు అనుకోవట్లేదు
  • పాలకులు చేసే తప్పుల మూలంగా సామాన్యులకు అన్యాయం
  • ఉత్తరాంధ్రలో సాగు నీటి ప్రాజెక్టుల పూర్తికి దృష్టిపెట్టరు

'ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ టీచర్ ఉద్యోగం కావాలన్నా, కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగం ఇప్పించాలన్నా... రూ.5 లక్షలపైనే తెలుగు దేశం నాయకులు, ప్రజా ప్రతినిధుల అనుచరులు లంచాలు గుంజుతుంటే దీన్ని పాలన అంటామా?' అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

 ఈరోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో జనసేన పోరాట యాత్రను సాగించారు. భారీ సంఖ్యలో జన సైనికులు హాజరయ్యారు. అక్కడి దేవి గుడి కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ఎటు చూసినా ఇసుక మాఫియా దోపిడీయే కనిపిస్తోంది అన్నారు. ఉత్తరాంధ్రను కూడా అమరావతిలా అభివృద్ధి చేయాలని ఎందుకు అనుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆయన ప్రశ్నించారు.

"పాలక వర్గాలు చేసే తప్పుల మూలంగా సామాన్యులు అవమానాలు, అన్యాయాన్ని, అసమానతల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రపై నిర్లక్ష్య వైఖరి కనపరుస్తున్నారు. ఉత్తరాంధ్రలో సాగు నీటి ప్రాజెక్టుల పూర్తికి దృష్టిపెట్టరు. పట్టిసీమ మాత్రం వేగంగా పూర్తి చేస్తారు. ఇలాంటి చర్యలను ప్రశ్నిస్తే నేను ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యోగాలు ఇచ్చినందుకు లంచం తీసుకుంటారు, నదిలో ఇసుకను దోచేస్తారు... అయినా మాట్లాడరు" అని అన్నారు. 

More Telugu News