Rajanna Sircilla District: ప్రేమించానంటున్న అమ్మాయి, అదేమీ లేదంటున్న అబ్బాయి... ఆత్మహత్యాయత్నంతో ఇద్దరూ ఆసుపత్రిపాలు!

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
  • ప్రియుడితో పెళ్లి కోరుతూ గత నెలాఖరులో ఓ మారు ఆత్మహత్యాయత్నం
  • తాను ప్రేమించడం లేదని అంటున్న ప్రియుడు

తాను ఓ యువకుడిని ప్రేమించానని చెబుతూ, అతనితోనే పెళ్లి జరిపించాలని ఓ యువతి, తాను అసలు ఆమెను ప్రేమించడమే లేదని చెబుతూ, ఇక పెళ్లేంటని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆసుపత్రిపాలైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మర్రిగడ్డ గ్రామానికి చెందిన ప్రశాంత్, కామారెడ్డి జిల్లాకు చెందిన సత్య... హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసుకుంటుండగా, 9 నెలల క్రితం వీరికి పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. అయితే తనను వివాహం చేసుకోవాలని సత్య కోరగా, ప్రశాంత్ అంగీకరించలేదు.

దీంతో గత నెల 26న సత్య చందుర్తి పోలీసులకు ప్రశాంత్ పై ఫిర్యాదు చేసింది. ప్రశాంత్ ను విచారించిన పోలీసులు, అతనికి ఆమెపై ప్రేమ లేదని గుర్తించి, ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. దీంతో మనస్తాపం చెందిన సత్య నిద్రమాత్రలు మింగింది. అయితే, సకాలంలో ఆసుపత్రిలో చికిత్స అందించడంతో ప్రాణాలు దక్కాయి. ఆ తరువాత నిన్న మర్రిగడ్డకు వచ్చిన ఆమె, ప్రశాంత్ తోనే తన పెళ్లి చేయాలంటూ గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి మరోమారు నిద్రమాత్రలు మింగింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రశాంత్, తాను ప్రేమించట్లేదని చెబుతుంటే, ఈ గోలేంటని ఆగ్రహంతో పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం సత్య సిరిసిల్లలోని ఆసుపత్రిలోను, ప్రశాంత్ వేములవాడలోని ఆసుపత్రిలోను చికిత్స పొందుతున్నారు. ఇద్దరికీ ప్రాణాపాయం ఏమీ లేదని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

More Telugu News