Karnataka: అదేం పని.. ఆ వ్యాఖ్యలను రికార్డు చేస్తారా?.. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం

  • సంకీర్ణ ప్రభుత్వంపై సంతోషంగా లేనంటూ సిద్ధరామయ్య వ్యాఖ్యలు
  • కర్ణాటకలో కలకలం
  • వివరణ ఇచ్చుకున్న మాజీ సీఎం

తానెప్పుడో, ఏదో సందర్భంలో అలవోకగా అన్న మాటలను రికార్డు చేసి విడుదల చేయడంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం పట్ల తాను పూర్తి సంతోషంగా ఉన్నానని, లేనని ఎవరు చెప్పారని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. తానెప్పుడో యథాలాపంగా అన్న వ్యాఖ్యలను రికార్డు చేసి విడుదల చేయడం సరికాదని హితవు పలికారు. అసలా మాటలను తాను అన్నానో, లేదో నిర్ధారించుకోకుండా ఆ వీడియో టేపులను ఎలా విడుదల చేస్తారని నిలదీశారు. తన మాటలను వక్రీకరించి ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా మాట్లాడుకునే మాటలను రికార్డు చేయడం తప్పని అన్నారు. అది సరికాదని పేర్కొన్నారు.

సంకీర్ణ ప్రభుత్వ తీరుపై తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇటీవల సంచలనం సృష్టించాయి. స్వయంగా ఆయన అన్న మాటలు మీడియాలో ప్రసారం కావడంతో కలకలం రేగింది. దీంతో స్పందించిన మాజీ ముఖ్యమంత్రి ఈ వివరణ ఇచ్చారు. కుమారస్వామి ప్రభుత్వంపై తాను పూర్తి సంతోషంగా ఉన్నట్టు చెప్పారు.

More Telugu News