Indians: భారతీయుల మదిలో మూడు చింతలు!

  • నేతల అవినీతికి తొలిస్థానం
  • ఆపై నిరుద్యోగం, పెరుగుతున్న నేరాలు
  • "వాట్‌ వర్రీస్‌ ద వరల్డ్‌" సర్వే

ఇండియాలో ప్రజల మనసులను బాధిస్తున్న టాప్-3 అంశాలేంటి? మిగతా దేశాల్లోనివారి బాధలేంటి? "వాట్‌ వర్రీస్‌ ద వరల్డ్‌" పేరిట 'ఇప్సోస్‌' అనే సంస్థ 28 దేశాల్లో ఓ సర్వే నిర్వహించి, ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాము ఎన్నుకున్న నేతలు, ఆర్థిక సంస్థల అవినీతి, ఎంత చదువు చదివినా ఉద్యోగాలు లభించకపోవడం, పెరుగుతున్న నేరాలు- హింసాత్మక ఘటనలు భారతీయుల మనసులను అత్యధికంగా బాధిస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 47 శాతం మంది అవినీతిని గురించి ప్రస్తావిస్తే, నేరాల గురించి 42 శాతం, నిరుద్యోగం గురించి 29 శాతం మంది ప్రస్తావించారు.

ఇక ప్రపంచం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే, సామాజిక అసమానతలు అతిపెద్ద సమస్యగా నిలిచాయి. రెండో స్థానంలో ఆరోగ్య సేవలు అందుబాటులో లేవన్న అభిప్రాయం వెల్లడైంది. ఆ తరువాతి స్థానంలో ఉగ్రవాదం నిలిచింది. సర్వేలో పాల్గొన్న అత్యధిక దేశాల్లో అవినీతి ఉన్నప్పటికీ, ఇండియాలో అవినీతి తీవ్రత చాలా అధికంగా ఉందని "వాట్‌ వర్రీస్‌ ద వరల్డ్‌" తెలిపింది. సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో నలుగురు హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు పెరిగిపోయాయని వెల్లడించింది. కాగా, సర్వేలో భాగంగా సమాధానాలు చెప్పిన వారిలో 60 శాతం మంది పరిస్థితులన్నీ ఏదో ఒకనాటికి సర్దుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

ఇదే సమయంలో తమ దేశం సరైన రీతిలో ముందడుగు వేస్తోందని 92 శాతం మంది చైనా వాసులు నమ్ముతున్నారని "వాట్‌ వర్రీస్‌ ద వరల్డ్‌" సర్వే వెల్లడించింది. ఆపై సౌదీ అరేబియాలో 76 శాతం మంది ప్రజలు, దక్షిణ కొరియాలో 74 శాతం మంది ప్రజలు ఇదే విషయాన్ని వెల్లడించారు.

More Telugu News