Warangal Urban District: రిలయన్స్ ఫ్రెష్ పప్పుల్లో పురుగులు, కాలం చెల్లిన బాదంపాలు... జరిమానా విధించిన అధికారులు!

  • వరంగల్ కేయూ క్రాస్ రోడ్స్ లో స్టోర్
  • పలు ఫిర్యాదులు రావడంతో శానిటరీ విభాగం తనిఖీ
  • రూ. 10 వేల జరిమానా విధించిన అధికారులు

రిలయన్స్ ఫ్రెష్ స్టోర్ లో పురుగులతో నిండిపోయిన పప్పు దినుసులు, ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన బాదంపాలు అమ్ముతున్నారని కొందరు వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు, ఫిర్యాదులు నిజమేనని నిర్ధారించి, జరిమానా విధించారు. వరంగల్ లోని కేయూ క్రాస్ రోడ్స్ లో ఉన్న రిలయన్స్ ఫ్రెష్ పై పలు ఆరోపణలు రావడంతో శానిటరీ ఇనస్పెక్టర్ శ్రీనివాస్ తనిఖీలకు వెళ్లారు.

అక్కడి పప్పులో పురుగులు కనిపించడం, కాలం చెల్లిన పానీయాలు ఉండటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రూ. 10 వేల జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ విషయమై స్టోర్ మేనేజర్ వివరణ ఇస్తూ, ఈ సెక్షన్ లో పనిచేసే ఉద్యోగి గత మూడు రోజులుగా రాకపోవడంతోనే కొన్ని ఉత్పత్తులను తొలగించలేకపోయామని, భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరుగకుండా చూసుకుంటామని చెప్పారు. 

More Telugu News