Hyderabad: గర్ల్ ఫ్రెండ్ పరువు తీయాలని చూసిన ప్రబుద్ధుడు... కటకటాల్లోకి!

  • ఆమె ఇతరులతో మాట్లాడడాన్ని సహించలేకపోయిన యువకుడు  
  • ఆమె పేరిట సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్స్
  • అమ్మాయి ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

ఇతర విద్యార్థులతో స్నేహంగా ఉంటున్న తన స్నేహితురాలి పరువు తీయాలని చూసిన ఓ ప్రబుద్ధుడు కటకటాల్లోకి వెళ్లాడు. హైదరాబాద్, రాచకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లా, నాగారానికి చెందిన ఇర్ల విఠల్ కుమార్ (22) కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో ఉంటూ ఉప్పల్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతనికి అదే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని పరిచయమై స్నేహితురాలిగా మారింది.

ఆ అమ్మాయి ఇతర అబ్బాయిలతో మాట్లాడుతూ ఉండటాన్ని చూసి సహించలేకపోయిన విఠల్, ఇదే విషయమై గొడవపడ్డాడు. ఆ అమ్మాయి తీరు మారకపోయేసరికి పరువు తీయాలని భావించాడు. నకిలీ మెయిల్ ఐడీలు సృష్టించి, యువతికి అసభ్య మెసేజ్ లు, నగ్న చిత్రాలు పంపాడు. అంతటితో ఆగక, ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఖాతా ఓపెన్ చేసి, అమ్మాయి ఫొటోలు డిస్ ప్లే పిక్చర్ గా ఉంచి, మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను పోస్టు చేయడం ప్రారంభించాడు.

అయితే తన ఫొటోలు ఎవరు పెడుతున్నారో అర్థంకాని ఆ విద్యార్థిని, రాచకొండ పోలీసులను ఆశ్రయించగా, రంగంలోకి దిగిన పోలీసులు, ఐపీ అడ్రస్ ల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. తానే నేరం చేశానని ఒప్పుకున్న నిందితుడిని రిమాండ్ కు తరలించారు.

More Telugu News