Goa: పుట్టింటికని చెప్పి ప్రియుడితో గోవాకు... జీపీఎస్ సాయంతో పట్టేసిన హైదరాబాద్ వ్యాపారి!

  • తనకన్నా పదేళ్ల చిన్నవాడితో ప్రేమాయణం
  • భర్తకు తెలిసిపోగా మన్నించాలని వేడుకోలు
  • ఆపైనా బుద్ధి మార్చుకోని మహిళ
  • మళ్లీ ప్రియుడిని కలిసిన వివాహిత

తనకన్నా పదేళ్లు చిన్నవాడైన అవివాహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, పుట్టింటికి వెళుతున్నానని చెప్పి ప్రియుడితో కలసి గోవాకు వెళ్లగా, జీపీఎస్ సాయంతో గుర్తించిన ఆమె భర్త హైదరాబాద్, ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లో వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి తరచూ క్యాంపుల నిమిత్తం బయటి ప్రాంతాలకు వెళుతుండగా, ఆ సమయంలో వ్యాపార కార్యకలాపాలను భార్య చూసేది. ఈ క్రమంలో కారును వాషింగ్ కు తీసుకెళ్లిన ఆమెకు షాపు యజమాని మాధవ్ పరిచయం అయ్యాడు. తనకన్నా పదేళ్లు చిన్నవాడైన మాధవ్ తో ఆమె వివాహేతర బంధాన్ని ప్రారంభించింది.

ఇటీవల వారిద్దరూ అమీర్ పేట లోని ఓ ఇంట్లో రహస్యంగా కలుసుకోవడంతో భర్త వారిని నిలదీశాడు. అప్పట్లో తనను మన్నించాలని వేడుకుంటూ, మరోసారి తప్పు చేయబోనని చెప్పిన ఆమె, కొన్ని రోజులు పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పింది. అనుమానం వచ్చిన భర్త, ఆమె కారులో జీపీఎస్ పరికరాన్ని అమర్చగా, ప్రియుడితో కలసి ఆమె గోవాకు వెళ్లింది. ఈ విషయాన్ని తన స్మార్ట్ ఫోన్ లో తెలుసుకున్న ఆ వ్యాపారి, భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నమ్మక ద్రోహం చేసిన భార్యను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేయాలని, తన కుమార్తెలను ఆమె వద్ద ఉంచితే, వారు చెడుదారిలో నడిచే ప్రమాదం ఉందని, వారిని తనకు అప్పగించాలని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News