Nizamabad District: కాంగ్రెస్ పెద్దలతో డీఎస్ రహస్య మంతనాలు... నేడో రేపో కీలక నిర్ణయం!

  • శరవేగంగా మారుతున్న నిజామాబాద్ రాజకీయం
  • గులాం నబీ ఆజాద్ తో మంతనాలు సాగించిన డీఎస్
  • తిరిగి కాంగ్రెస్ లో చేరాలని భావన
  • పెద్ద కుమారుడితో రాజకీయ భవిష్యత్తుపై చర్చలు

నిజామాబాద్ జిల్లా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి తానింక బయటకు వెళ్లక తప్పదని కొద్ది రోజుల క్రితమే ఓ నిర్ణయానికి వచ్చిన డీఎస్, రెండు రోజుల క్రితం తన అనుచరులతో మాట్లాడి, ఆపై గులాం నబీ ఆజాద్ తో రహస్యంగా మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. సీఎం అభ్యర్థిగా ఉన్న మీరు అసలు టీఆర్ఎస్ లో చేరడం ఏంటని తన సన్నిహితుల నుంచి గతంలోనే ప్రశ్నలను ఎదుర్కొన్న ఆయన, పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 టీఆర్ఎస్ లో తనకు కనీస ప్రాధాన్యత దక్కలేదని, నిజామాబాద్ జిల్లాలో జరిగే కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని గత కొంతకాలంగా మనస్తాపంతో ఉన్న ఆయన, పార్టీ మారే ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించినట్టు సమాచారం. ఇక నేడో రేపో ఆయన కీలక నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తుండగా, ప్రస్తుతం ఆయన తన ఇంట్లో పెద్ద కుమారుడితో సమావేశమై, రాజకీయ భవిష్యత్తుపై చర్చలు సాగిస్తున్నారు. డీఎస్ ఇంటికి ఆయన అనుచరులు ఒక్కొక్కరుగా చేరుకుంటుండగా, ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. కాసేపట్లో అనుచరులతో మరోసారి మాట్లాడిన తరువాత డీఎస్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

More Telugu News