Lalita Yadav: కప్పలకు పెళ్లి చేసినందుకు మంత్రిపై పోలీసు కేసు!

  • మధ్యప్రదేశ్ లో కప్పలకు పెళ్లి జరిపించిన మంత్రి లలితా యాదవ్‌
  • కేసు పెట్టిన హర్యానా వన్య ప్రాణ హక్కుల సంస్థ
  • నేరం రుజువైతే మూడేళ్ల వరకూ జైలు

మధ్యప్రదేశ్ లో వానల కోసం కప్పలకు పెళ్లి జరిపించిన మహిళా శిశుసంక్షేమ శాఖ సహాయమంత్రి లలితా యాదవ్‌ పై పోలీసు కేసు నమోదైంది. హర్యానా వన్యప్రాణ హక్కుల సంస్థ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎనిమల్ అండ్ బర్డ్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు జంతుహింస నివారణ చట్టం 1960 సెక్షన్ 3, ఐపీసీ 429,428, 120 బి ప్రకారం లలితా యాదవ్ పై కేసు పెట్టారు. ఈ కేసులో నేరం రుజువైతే మంత్రికి మూడు సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

కాగా, కప్పలకు పెళ్లి చేస్తే ఇంద్రుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని నమ్మే ఆచారం భారతావనిలో అనాదిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశంతో చేసే ఈ పని వెనుక పర్యావరణ సమతుల్యమనే సూత్రం కూడా ఉందని లలితా యాదవ్ అంటుండగా, మంత్రి అయ్యుండి మూఢనమ్మకాలను ప్రోత్సహించడం ఏంటని విపక్షాలు మండిపడుతున్నాయి.

More Telugu News