ghanshyam tiwari: ఎన్నికల ముందు రాజస్థాన్ లో బీజేపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత

  • పార్టీకి గుడ్ బై చెప్పిన ఘన్ శ్యామ్ తివారీ
  • అమిత్ షాకు రాజీనామా లేఖ సమర్పణ
  • వసుంధరా రాజే తీరును నిరసిస్తూ రాజీనామా

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో రాజస్థాన్ లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత ఘన్ శ్యామ్ తివారీ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు. ముఖ్యమంత్రి వసుంధరా రాజే వ్యవహరిస్తున్న తీరు వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు లేఖలో ఆయన వెల్లడించారు.

వసుంధరా రాజే నిరంకుశపాలన పట్ల రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని... గెలిచే అవకాశాలు కూడా సన్నగిల్లాయని ఆయన అన్నారు. పార్టీలో ఉన్న సీనియర్లను పట్టించుకోకుండా, ఫిరాయింపు నేతలకే ఆమె పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. సీఎం తీరు వల్ల రానున్న ఎన్నికల్లో పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.

రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలంటూ తాను అధిష్ఠానాన్ని పలుమార్లు కోరానని... అయినా పట్టించుకోలేదని తివారీ చెప్పారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలను అడ్డుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తివారీ... రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వహించారు.

More Telugu News