iphone x: రూ.50,000కే ఐఫోన్ ఎక్స్ తరహా ఫోన్... భారత్ లో విడుదలకు యాపిల్ సన్నాహాలు!

  • రూ.50,000 స్థాయిలో ధరను నిర్ణయించే అవకాశం
  • ప్రారంభ స్థాయి ఫోన్ గా దీన్ని ప్రవేశపెట్టే ఆలోచన
  • 6.1 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లేతో ఉంటుందని ఫోర్బ్స్ కథనం

బడ్జెట్ ధరలో యాపిల్ ఐఫోన్ ఎక్స్ ను పోలిన ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్లకు కేసులను తయారు చేసే ఒలిక్సర్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 6.1 అంగుళాలతో కూడిన ఈ ఫోన్ ను 600 డాలర్ల ప్రారంభ ధరతో విడుదల చేయవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మన కరెన్సీలో చూస్తే 40,800. స్థానిక పన్నులతో కలుపుకుంటే రూ.50,000 ధరకే ఐఫోన్ ఎక్స్ మాదిరి ఫోన్ ను మార్కెట్ చేయవచ్చని యాపిల్ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే, ఇది ఐఫోన్ ఎక్స్ లో మార్పులు చేసిన వెర్షనా లేక మరేదైనా అన్నదానిపై అధికారిక సమాచారం లేదు. కాకపోతే ఐఫోన్ ఎక్స్ మాదిరిగా నాచ్ డిస్ ప్లేతో ఉంటుందని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. చూడ్డానికి ఐఫోన్ ఎక్స్ మాదిరిగానే ఉంటుందని తన కథనంలో పేర్కొంది. ఇందులో ఫేస్ ఐడీ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. ఓఎల్ఈడీ డిస్ ప్లే కాకుండా ఎల్ సీడీ డిస్ ప్లేతో ఉంటుంది. ఐఫోన్ ఎస్ఈ స్థానంలో ఈ ఫోన్ ను ప్రారంభ స్థాయి ఫోన్ గా యాపిల్ ప్రవేశపెట్టనుందని ఫోర్బ్స్ తెలిపింది.

More Telugu News