cheetah: ఇంట్లోకి వెళ్తున్న బాలుడిని నోట కరుచుకుని వెళ్లిన చిరుత!

  • ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘటన
  • మనుషుల రక్తం రుచిమరిగిన చిరుత
  • ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారులను పొట్టనపెట్టుకున్న వైనం

ఓ బాలుడిని తల్లిదండ్రుల కళ్ల ఎదుటే చిరుతపులి నోట కరుచుకుని వెళ్లిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. పితోర్ ఘడ్ జిల్లా పోఖ్రీ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కార్తీక్ అనే ఐదేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలసి ఢిల్లీలో జరిగిన ఓ వివాహానికి వెళ్లాడు. నిన్న రాత్రి వీరు స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఇంటి వద్ద కారు ఆగగానే... ఆ చిన్నారి హుషారుగా ఇంట్లోకి పరుగుపెట్టాడు. అయితే, ఇంటి  సమీపంలోని పొదల్లో మాటువేసిన ఓ చిరుత... ఆ బాలుడిని నోట  కరుచుకుని రెప్పపాటు కాలంలోనే అడవిలోకి పారిపోయింది.

 అనంతరం అతని తల్లిదండ్రులు, బంధువులతో పాటు గ్రామస్తులు అడవిలో గాలించగా... చిన్నారి మృతదేహం కనిపించింది. బాగేశ్వర్ జిల్లాలో ఇటీవలే ఓ ఏడేళ్ల బాలుడిని, మార్చి నెలలో నాలుగేళ్ల మరో బాలుడిని కూడా చిరుత పొట్టనపెట్టుకుంది. దీంతో, మనుషుల రక్తం తాగేందుకు అలవాటు పడ్డ చిరుతను చంపేయాలంటూ అటవీ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News