England: ఇంగ్లండ్ గడ్డపై ఆసీస్ చిత్తు.. తొలిసారి 5-0తో ఇంగ్లండ్ సిరీస్ విజయం!

  • ఆస్ట్రేలియాపై తొలిసారి 5-0తో క్లీన్ స్వీప్
  • తొలుత ఓటమి దిశగా పయనించిన ఇంగ్లండ్
  • జోస్ బట్లర్ అద్భుత ఆటతో విజయం

సొంతగడ్డపై ఇంగ్లండ్ దుమ్ము రేపుతోంది. ఆసీస్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. తొలిసారి 5-0తో ఆసీస్‌ను వైట్‌వాష్ చేసి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ చెలరేగి ఆడాడు. 122 బంతుల్లో 110 పరుగులు చేసి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా జరిగిన ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 34.4 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం 206 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆరంభంలో తడబడింది. 86 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించినట్టు కనిపించింది. ఆ తర్వాత మరి కాసేపటికే మరో రెండు వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ విజయం తథ్యమని భావించారు.

అయితే జోస్ బట్లర్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజయ పథంలో నిలిపాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన బట్లర్ 12 ఫోర్లు, సిక్సర్‌తో అజేయ సెంచరీ (110)తో జట్టును గెలిపించాడు. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌ను 5-0తో గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. సెంచరీతో జట్టును గెలిపించిన బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

More Telugu News