Road Accident: తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం.. కారు-ఆటో ఢీ.. ఐదుగురి దుర్మరణం

  • తెలంగాణలో రోడ్ల రక్త దాహం
  • నిన్న 14 మంది.. నేడు ఐదుగురు
  • కూరగాయలు అమ్ముకునేందుకు వెళ్తుండగా ప్రమాదం

తెలంగాణలో రోడ్ల రక్త దాహం తీరినట్టు కనిపించడం లేదు. రోజుకో ప్రమాదంతో రహదారులు రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. ఆదివారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ సమీపంలో జరిగిన ప్రమాదంలో 14 మంది మహిళలు మృతి చెందారు. ఈ విషాద ఘటనను మర్చిపోకముందే ఈ ఉదయం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి గేట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

కూరగాయలను విక్రయించేందుకు ఆటోలో వెళ్తన్న వారిని కారు రూపంలో వచ్చిన మృత్యువు కాటేసింది. వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. గాయపడిన ముగ్గురిని హైదరాబాద్ తరలించారు. మృతులను చెన్నారెడ్డిగూడేనికి చెందిన చీమల మమత, చీమల సుజాత, ఆంబోతు అసలీ, ఆంబోతు మారు, డ్రైవర్ వంగల శ్రీనుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News