Hyderabad: అనాథ శరణాలయలోకి అర్ధరాత్రి చొరబడి హల్ చల్.. నిద్రిస్తున్న బాలికలతో అసభ్య ప్రవర్తన!

  • కిటీకి చువ్వలు తొలగించి బాలికల గదిలోకి ప్రవేశం
  • నిద్రిస్తున్న బాలికలతో అసభ్య ప్రవర్తన
  • దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

అర్ధరాత్రి మద్యం మత్తులో అనాథ శరణాలయంలోకి ప్రవేశించి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి దేహశుద్ధి జరిగింది. హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బాలాజీనగర్‌ ఆనంద్‌నగర్‌ కాలనీకి చెందిన కగ్గా వెంకట్రావు పదేళ్లుగా అరుణోదయ సేవా సంస్థ నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం 18 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు.

శుక్రవారం రాత్రి భోజనం అనంతరం చిన్నారులు రెండో అంతస్తులో నిద్రపోయారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పూర్తిగా తాగిన మత్తులో ఉన్న ఓ యువకుడు పక్కనే ఉన్న బిల్డింగ్ నుంచి ఆశ్రమంలోకి దూకాడు. తలుపులు మూసి ఉండడంతో వెనకవైపు ఉన్న కిటీకి చువ్వలను తొలగించి లోపలికి వెళ్లాడు. నిద్రిస్తున్న బాలికల వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.

మెలకువ వచ్చిన ఓ బాలిక భయంతో అరవడంతో మిగతా అందరూ లేచారు. నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. యువకుడిని యాప్రాల్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ పూజపతి సంతోష్ (30) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News