Kurnool District: కర్నూలు జిల్లాలో పెను విషాదం.. ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ.. ఏడుగురు దుర్మరణం

  • తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం
  • నుజ్జునుజ్జు అయిన ఆటో
  • మృతుల్లో ఎక్కువమంది వృద్ధులు

కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కోడుమూరు మండలం కల్లపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

నాటువైద్యం కోసం వీరంతా ఆటోలో మహానందికి వెళ్తుండగా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె దగ్గర నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వీరి ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎక్కువమంది వృద్ధులు ఉన్నారు.

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News