Madhya Pradesh: ఇండోర్‌లో స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌ అవార్డును స్వీక‌రించిన హైదరాబాద్‌ మేయ‌ర్ రామ్మోహ‌న్‌

  • ఘ‌నవ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌లో దేశంలోనే హైద‌రాబాద్ అగ్ర‌గామి
  • ప్ర‌తి స‌ర్కిల్‌లో గార్బెజ్ సెగ్రిగేష‌న్ పాయింట్ల‌ ఏర్పాటు
  • త‌డి, పొడి చెత్తలను వేర్వేరు చేయ‌డం విజయవంతం
  • స్వ‌చ్ఛ అవార్డుల‌ను అంద‌జేసిన కేంద్రమంత్రి హ‌ర్దీప్‌ సింగ్‌

ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌లో దేశంలోనే అగ్ర‌గామిగా నిలిచిన హైద‌రాబాద్ న‌గ‌రానికి ఇటీవల కేంద్ర సర్కారు స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018 ప్ర‌త్యేక పుర‌స్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక స‌మావేశంలో ఆ అవార్డును హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌ కుమార్, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ బీ జ‌నార్దన్‌ రెడ్డి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌లకు కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్‌పూరి అంద‌జేశారు.

దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలు రాజ‌ధానులు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమ‌లు అవుతున్న ఘ‌న‌వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌లో హైద‌రాబాద్ న‌గరానికి స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ అగ్ర‌స్థానం ఇచ్చింది.

ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌లో జీహెచ్ఎంసీ చేప‌ట్టిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు..

హైద‌రాబాద్ న‌గ‌రంలో 1,116 ఓపెన్ గార్బెజ్ పాయింట్ల‌ను ఎత్తి వేయ‌డం, స్వచ్ఛ హైద‌రాబాద్‌లో భాగంగా ఇంటింటి నుండి త‌డి, పొడి చెత్తల‌ను వేర్వేరుగా చేయ‌డానికి ఇంటింటికి రెండు డ‌స్ట్‌బిన్‌ల చొప్పున 44 ల‌క్ష‌ల డ‌స్ట్‌బిన్‌ల పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే గృహిణుల‌కు బొట్టు, తిల‌కం పెట్ట‌డం, స్వ‌యం స‌హాయ‌క మ‌హిళ‌లు, పాఠ‌శాల విద్యార్థులతో ప్ర‌త్యేకంగా ప్ర‌తిజ్ఞ చేయించ‌డం, భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల త‌ర‌లింపు, ప్ర‌తి స‌ర్కిల్‌లో గార్బెజ్ సెగ్రిగేష‌న్ పాయింట్ల‌ను ఏర్పాటు చేయ‌డం త‌దిత‌ర వినూత్న కార్య‌క్ర‌మాల అమ‌లు చేయ‌డం ద్వారా ఘ‌న వ్య‌ర్థ‌ప‌దార్థాల నిర్వ‌హ‌ణ‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ దేశంలోనే అగ్ర‌స్థానంలో నిలిచింది.

త‌డి, పొడి చెత్తలను వేర్వేరు చేయ‌డం కేవ‌లం పాశ్చత్య దేశాల‌లోని న‌గ‌రాల్లోనే జ‌రుగుతోంది. భార‌త దేశంలోని ఏ న‌గ‌రంలోనూ చెత్తను వేర్వేరుగా సేక‌రించే విధానం అమ‌లు చేయ‌లేదు. కానీ హైదరాబాద్‌లో ఆ పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఘ‌న వ్యర్థాల నిర్వహ‌ణ చ‌ట్టం-2016ను తెలంగాణ ప‌టిష్టంగా అమ‌లుచేస్తోంది.

దీనిలో భాగంగా త‌డి, పొడి చెత్తను వేర్వేరు చేయ‌డం, ప‌రిస‌రాల ప‌రిశుభ్రత‌, గార్బెజ్ పాయింట్లను తొల‌గించ‌డం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఘ‌న వ్యర్థాల తొల‌గింపులో కాల‌నీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధుల‌తో పాటు దాదాపు 5ల‌క్ష‌ల మంది స‌భ్యులున్న స్వ‌యం స‌హాయ‌క బృందాల మ‌హిళ‌లు, 10 ల‌క్ష‌లకు పైగా ఉన్న పాఠ‌శాల విద్యార్థుల స‌హ‌కారాల‌ను చేప‌ట్టింది. న‌గ‌రంలోని వివిధ కాల‌నీల్లో ఇంటింటికి వెళ్లి గృహిణీలు, ఇళ్ల‌లో ప‌నిచేసే వాళ్ల‌కు త‌డి, పొడి చెత్త‌ను ఆకుప‌చ్చ‌, నీలంరంగు డ‌బ్బాల్లో వేసే విధంగా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.

ప్ర‌తి కాలనీ, పార్కులు, హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లో కంపోస్టింగ్ ఎరువుల త‌యారీకి ప్ర‌త్యేకంగా గుంత‌లు తవ్వించుకోవాల‌ని కూడా జీహెచ్ఎంసీ అధికారులు అవ‌గాహ‌న‌ క‌ల్పించారు. ఇప్ప‌టికే న‌గ‌రంలోని నిరుద్యోగ యువ‌త‌కు అందించిన 2,000 స్వ‌చ్ఛ ఆటో టిప్ప‌ర్ల ద్వారా త‌డి, పొడి చెత్త‌ల‌ను వేర్వేరుగా త‌ర‌లించే ప్ర‌క్రియతో పాటు మ‌రో 500 స్వ‌చ్ఛ ఆటోల‌ను కూడా నిరుద్యోగ యువ‌త‌కు జీహెచ్ఎంసీ అందించింది.       

More Telugu News