New Delhi: దాతీ మహరాజ్‌ బాబాపై అత్యాచారం ఆరోపణ.. పుంసత్వ పరీక్షలకు పోలీసుల నిర్ణయం!

  • రెండేళ్ల క్రితం ఆశ్రమంలో మహిళపై అత్యాచారం
  • డబ్బుల కోసమే కేసు పెట్టిందంటున్న ఆశ్రమ వర్గాలు
  • కాల్ డేటా పరిశీలించాలని పోలీసుల నిర్ణయం

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వయం ప్రకటిత దైవాంశ సంభూతుడు దాతీ మహరాజ్‌ బాబాకు పుంసత్వ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. నాగా సెక్టార్‌లోని చత్రాపూర్ ఆశ్రమంలో 2016లో దాతీ మహరాజ్ తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రాణానికి హాని ఉండడంతోనే ఈ విషయాన్ని ఇంతకాలం బయటపెట్టలేదని పేర్కొంది. అయితే, అత్యాచారం జరిగిందని బాధితురాలు చెబుతున్న రోజున దాతీ మహరాజ్ అసలు ఆశ్రమంలోనే లేరంటూ ఆశ్రమ అధికారులు పోలీసులకు ఆధారాలు సమర్పించారు. డబ్బుల కోసమే ఆమె కేసు పెట్టిందని ఆరోపించారు.

మరోవైపు మహారాజ్ తనపై పలుమార్లు అత్యాచారం చేశారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. తన కోరిక తీర్చాలని ఫోన్ చేసి వేధించారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు బాబా మొబైల్ కాల్ డేటాను పరిశీలించాలని నిర్ణయించారు. బాబాను ఇప్పటికే ప్రశ్నించిన పోలీసులు ఆయనకు పుంసత్వ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు.

More Telugu News