Balakrishna: బసవతారకం ఆసుపత్రి వేడుకల్లో బాలకృష్ణ, కల్వకుంట్ల కవిత, శ్రియ

  • బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవ వేడుకలు
  • తక్కువ ఖర్చుతోనే మెరుగైన సేవలందిస్తున్నామన్న బాలయ్య
  • తొలి దశలోనే క్యాన్సర్ ను గుర్తించాలన్న కవిత

హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి ఛైర్మన్, సీనీ నటుడు బాలయ్య, డైరెక్టర్ బోయపాటి, హీరోయిన్ శ్రియలు హాజరయ్యారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, బసవతారకం ఆసుపత్రి ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థ అని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. వైద్య సేవలు పొందిన ఏ ఒక్కరు ప్రశంసించినా... సాక్షాత్తు అమ్మే దీవించిందని అనుకుంటామని చెప్పారు. ఆసుపత్రికి ట్యాక్స్ రద్దు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని... తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
ఎంపీ కవిత మాట్లాడుతూ, క్యాన్సర్ తో బాధపడుతున్నవారికి బసవతారకం ఆసుపత్రి ఎంతో సేవ చేస్తోందని చెప్పారు. మెరుగైన సేవలు అందేలా కృషి చేస్తున్న బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. క్యాన్సర్ విషయంలో ఎంత చేసినా, ఇంకా చేయాల్సింది ఉందని అన్నారు. మహిళలు ప్రతి యేడాది సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. తొలి దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే... దాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.

More Telugu News