TTD: రమణ దీక్షితులకు మద్దతుగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడడం కుట్ర రాజకీయాలను బహిర్గతం చేస్తోంది: కేఈ కృష్ణమూర్తి

  • గతంలోనే పింక్ డైమండ్‌ గురించి తెలిస్తే ఎందుకు మాట్లాడలేదు?
  • ఆ విషయాన్ని‌ ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు
  • ఎవరయినా  చెబితే అదే నిజం అనుకుని పవన్ మాట్లాడతారు

టీటీడీ నగలు వైఎస్సార్‌ హయాంలోనే అపహరణకు గురయ్యాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారని, గతంలోనే పింక్ డైమండ్‌ గురించి తెలిస్తే పవన్‌ అప్పుడే ఎందుకు మాట్లాడలేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నిలదీశారు. తెలిసిన వెంటనే ఆ విషయాన్ని పవన్‌ ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.

ఈరోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... రమణ దీక్షితులకి మద్దతుగా పవన్‌ మాట్లాడడం కుట్ర రాజకీయాలను బహిర్గతం చేస్తోందని ఆరోపించారు. టీటీడీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా రమణదీక్షితులు మాట్లాడుతున్నారని, ఆయన చేస్తున్న అసత్య ఆరోపణలు, రాజకీయ విమర్శల పట్ల స్వామి వారి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఎవరయినా ఏదయినా చెబితే అదే నిజం అనుకుని పవన్ కల్యాణ్‌ మాట్లాడతారని కేఈ కృష్ణమూర్తి అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై గతంలో పవన్‌ కల్యాణ్‌ తీవ్ర అభియోగాలు చేశారని, ఆధారాలు చూపమంటే ఎవరో చెబితే చెప్పానని అన్నారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడకూడదని హితవు పలికారు.  

More Telugu News