Jagan: జగన్‌కే తన మద్దతని పవన్‌ కల్యాణ్‌ నాకు చెప్పారు: వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ కీలక వ్యాఖ్య

  • వ్యక్తిగతంగా బాగా శ్రమిస్తోన్న వ్యక్తి జగన్‌
  • వైసీపీతో పవన్‌ కలిసేందుకు ప్రయత్నం చేసింది నిజమే
  • చంద్రబాబు చేసే అవినీతి పవన్‌కు నచ్చలేదు
  • 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వడానికి పవన్‌ సిద్ధం

తమ పార్టీతో కలిసి పని చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారని వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్‌ పార్టీ బలోపేతానికి, ప్రజల సంక్షేమానికి వ్యక్తిగతంగా బాగా శ్రమిస్తున్నారని అన్నారని తెలిపారు. జగన్‌కే తన మద్దతు ఉంటుందని పవన్‌ చెప్పారని అన్నారు. వైసీపీతో పవన్‌ కలిసేందుకు ప్రయత్నం చేసింది నిజమేనని, చంద్రబాబు చేసే అవినీతి ఆయనకు నచ్చడం లేదని, అందుకే జగన్‌తో కలిసి నడిచేందుకు సిద్ధపడ్డారని చెప్పుకొచ్చారు.

2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వడానికి పవన్‌ సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. 2014లో తాను చంద్రబాబుకు మద్దతిచ్చానని, అయితే ఏపీ సర్కారు ప్రజలకు ఏం చేయలేదని పవన్‌ అన్నారని ఆయన తెలిపారు. అనుభవజ్ఞుడని మద్దతిస్తే ఈ నాలుగేళ్లలో ఆయన పాలనలో అవినీతి పెరిగిపోయిందని, ప్రత్యేక హోదా కూడా తీసుకురాలేదని పవన్‌ అన్నారని వరప్రసాద్‌ తెలిపారు.

More Telugu News