suicide: చెప్పుతో కొట్టిన భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త

  • కృష్ణా జిల్లా చాట్రాయిలో చోటుచేసుకున్న ఘటన
  • పోలీసుల ఎదుటే చెప్పుతో కొట్టిన భార్య
  • ఇంట్లో ఉరివేసుకున్న భర్త

భార్య చెప్పుతో కొట్టినందుకు తీవ్ర మనోవేదనకు గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, మండల కేంద్రమైన చాట్రాయి గ్రామానికి చెందిన చుండూరు కిషోర్ (22) అదే మండలంలోని సి.గుడిపాడు గ్రామానికి చెందిన శ్యామలను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన ఏడు రోజులకే వీరు విడిపోయారు. కిషోర్ తనను వేధిస్తున్నాడంటూ ఈనెల 19న స్థానిక పోలీస్ స్టేషన్ లో శ్యామల ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో, కిషోర్ కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె జోలికి వెళ్లనంటూ కిషోర్ హామీ పత్రం రాసిచ్చాడు.

ఆ మరుసటి రోజు ఇద్దరినీ స్టేషన్ కు పిలిపించారు పోలీసులు. పోలీసులు వారితో మాట్లాడుతుండగానే... కిషోర్ ను శ్యామల చెప్పుతో కొట్టింది. దీంతో, అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నిన్న సాయంత్రం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ముందు శ్యామల తనను చెప్పుతో కొట్టడాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ సైసూడ్ నోట్ కూడా రాశాడు. మరోవైపు, కిషోర్ చావుకు కారణమైన వారిని శిక్షించాలంటూ అతని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా చేశారు. శ్యామలతో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలంటూ, కిషోర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

More Telugu News