YSRCP: మా రాజీనామాల ఆమోదం టీడీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు: వైసీపీ ఎంపీలు

  • ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తాం
  • హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
  • ఉపఎన్నికలు వచ్చేలా ఈసీ చర్యలు తీసుకోవాలి

ఏపీకీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలకు లోక్ సభ స్పీకర్ ఆమోదం తెలిపారు. దీనిపై వైసీపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మా రాజీనామాల అంగీకారం టీడీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగిస్తామని, హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఉపఎన్నికలు వచ్చేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు.

హోదా’ కోసం పోరాటం కొనసాగిస్తాం: వరప్రసాద్

తమ రాజీనామాలు ఆమోదించినందుకు సంతోషమని వరప్రసాద్ అన్నారు. ప్రత్యేక ‘హోదా’ కోసం తమ పోరాటం కొనసాగిస్తామని, ఓటమి భయంతోనే టీడీపీ తమపై బురదజల్లుతోందని విమర్శించారు. హోదా’ను అవహేళన చేసిన చంద్రబాబే ప్యాకేజ్ కు ఒప్పుకున్నారని, ఉద్యమం ఉద్ధృతం కావడంతో బాబు యూ టర్న్ తీసుకున్నారని అన్నారు.

హోదా’పై ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజలు గమినిస్తున్నారు: మేకపాటి

బీజేపీతో నాలుగేళ్లు అంటకాగిన చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని
మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఓ వైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు, మరోవైపు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీతో చంద్రబాబు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని, హోదా’ సాధనపై ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

More Telugu News