Hyderabad: హైదరాబాద్ లో దారుణం... తొలిరోజు బడికి వెళుతున్న చిన్నారిని చిదిమేసిన కారు!

  • సైదాబాద్ పరిధిలో ఘటన
  • నర్సరీలో రెహ్మాన్ ను చేర్పించిన తల్లిదండ్రులు
  • కన్నతల్లి ముందే బలంగా ఢీకొట్టిన కారు

పుట్టిన క్షణం నుంచి తల్లి ఒడిలో హ్యాపీగా ఉన్న మూడున్నరేళ్ల చిన్నారి, తొలిసారిగా బడికి వెళుతున్న వేళ, మృత్యువు రూపంలో వచ్చిన కారు, పాఠశాల ముందే చిన్నారిని చిదిమేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, హఫీజ్ బాబా నగర్ లో నివసించే మహబూబ్ అలీ, ముబీన్ బేగం దంపతులకు రహ్మాన్ అలీ అనే మూడున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. అతన్ని ఇటీవలే ఓ పాఠశాలలో నర్సరీలో చేర్పించిన తల్లిదండ్రులు, రంజాన్ తరువాత పంపిద్దామని భావించారు.

పండగ తరువాత తన కుమారుడిని తొలిసారిగా ముబీన్ బేగం బడికి తీసుకు వెళ్లింది. ఇంటి నుంచి ఆటోలో బడివద్దకు వెళ్లి, పాఠశాలలోకి వెళుతుండగా, మాతృశ్రీ కాలనీ నుంచి వేగంగా వచ్చిన కారు రెహ్మాన్ ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందు చక్రాల కింద నలిగిపోయిన రెహ్మాన్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News