Puri: పూరీ జగన్నాథ స్వామికి జలుబు చేసి జ్వరమొచ్చిందట... చీకటి గదికి మూలవరుల తరలింపు!

  • పౌర్ణమినాడు అభిషేకం
  • నీటిలో తడిసినందున జ్వరం వస్తుందని భక్తుల నమ్మకం
  • చీకటి గదిలో 15 రోజుల పాటు వైద్య సేవలు

పూరీ జగన్నాథునికి జలుబు చేసి జ్వరమొచ్చిందట. ఆయనకే కాదు, పక్కనే ఉండే బలభద్రుడు, సుభద్రాదేవిలకు కూడా. దీంతో ప్రధానార్చకులు, దేవతామూర్తులను పదిహేను రోజుల పాటు చీకటి మందిరంలో ఉంచి, నైవేద్యాల్లో ఆయుర్వేద మూలికలను వినియోగిస్తున్నారు. అంతేకాదు, భక్తులకు స్వామివారి దర్శనం కూడా లభించడం లేదు. గర్భాలయంలో 'పట్టా చిత్రా' పేరిట స్వామివారి చిత్రపటాన్ని మాత్రమే ఉంచారు.

ఇదంతా ఎందుకో తెలుసా? పూరీలో దేవతామూర్తుల మూలవరుల విగ్రహాలు కలపతో తయారు చేయబడినవై ఉంటాయి. స్వామికి నిత్యమూ అభిషేకం చేస్తే కలప పాడవుతుంది కాబట్టి, ప్రతి యేటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రమే అభిషేకం చేస్తారు. ఈ ఉత్సవం ముగిసిన తరువాత, నీటిలో నడిచిన కారణంతో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు జ్వరం, జలుబు చేస్తుందన్న అనుమానంతో మరలా వచ్చే పౌర్ణమి వరకూ వేరే గదిలోకి తరలిస్తారు. తిరిగి రథయాత్రకు ముందురోజు మాత్రమే విగ్రహాలను గర్భాలయానికి తెచ్చి, తిరిగి ప్రతిష్ఠిస్తారు.

More Telugu News