Twitter: వార్త చదువుతూ కన్నీరు ఆపుకోలేకపోయిన న్యూస్‌ రీడర్‌.. వీడియో వైరల్!

  • ఎమ్‌ఎస్‌ఎన్‌బీసీ టీవీ ఛానెల్‌లో ఘటన
  • అక్రమంగా సరిహద్దులు దాటుతోన్న వారిపై అమెరికా చర్యలు
  • తల్లిదండ్రులను, వారి పిల్లలను వేరు చేస్తోన్న వైనం
  • వార్త చదువుతూ భావోద్వేగానికి గురైన న్యూస్‌ రీడర్ 

ఓ వార్త చదువుతూ న్యూస్‌ రీడర్‌ కన్నీరు ఆపుకోలేకపోయిన ఘటన అమెరికాకు చెందిన ఎమ్‌ఎస్‌ఎన్‌బీసీ టీవీ ఛానెల్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే న్యూస్‌ రీడర్‌ రాచెల్‌.. మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలో అక్రమంగా ప్రవేశించే వారిపై తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం గురించి వార్త చదువుతోంది.

అక్రమ వలసదారుల సంతానాన్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి, వారిని ప్రత్యేక కేంద్రాల్లో ఉంచుతున్నారని ఆమె చెబుతూ కన్నీరు ఆపుకోలేకపోయింది. వార్తను చదవాలని ప్రయత్నించినప్పటికీ ఆమె వల్ల కాలేదు. చివరకు సారీ చెప్పేసి వార్తను చదవడం ఆపేసింది. కాగా, మెక్సికో నుంచి అక్రమంగా సరిహద్దులు దాటుతున్న తల్లిదండ్రులను, వారి పిల్లలను అమెరికా సరిహద్దు దళాలు బలవంతంగా వేరు చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. వాటిని చూస్తోన్న నెటిజన్లు అమెరికా సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

More Telugu News