sakshara bharat: ‘సాక్షర భారత్’ పథకాన్ని నిలిపివేసింది కేంద్రమే!: బీజేపీ నేతల విమర్శలకు జూపూడి కౌంటర్

  • ‘సాక్షర భారత్ మిషన్’ కేంద్రం నిలిపివేసింది
  • గౌరవ వేతనం నష్టపోతున్న 19 వేలకు పైగా వాలంటీర్లు
  • ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్న చంద్రబాబు 

‘సాక్షర భారత్ ఉద్యోగుల తొలగింపు గంటా నిర్ణయమా? లేక చంద్రబాబు నిర్ణయమా?
ఏపీలో ఒక్క మెమోతో విద్యా శాఖకు చెందిన 21 వేల మంది ఉద్యోగులను తొలగించడం వింతగా ఉంది. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని’ అని బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, విష్ణువర్థన్ రెడ్డి నిన్న విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు విషయం స్పష్టం చేశారు. సాక్షర భారత్ మిషన్ కార్యక్రమంలోని వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని, అది నిజం కాదని వివరణ ఇచ్చారు.

సాక్షర భారత్ మిషన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకమని, అది 2009లో ప్రారంభమైందని చెప్పారు. దీనిని నిలిపివేసింది కేంద్రమేనని, ఆ కారణంగా 19,336 మంది వాలంటీర్లు గౌరవ వేతనం నష్టపోతారని అన్నారు. ‘సాక్షర భారత్’ లోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నిష్పత్తి 60:40 గా ఉంటుందని, కేంద్రం ఈ పథకాన్ని 2016లో, 17లో నిలిపివేస్తున్నట్లు చెబుతూ ఆ రెండేళ్లూ పొడిగిస్తూ వచ్చిందని, చివరకు ఈ ఏడాది మార్చిలో దీనిని నిలిపివేసిందని చెప్పారు.

ఈ పథకం కింద రాష్ట్రంలో 18,862 మంది గ్రామ కోఆర్డినేటర్లు, 494 మంది మండల కోఆర్డినేటర్లు పని చేస్తున్నట్టు చెప్పారు. గ్రామ కోఆర్డినేటర్ కు నెలకు రూ.2,000, మండల కోఆర్డినేటర్ కు రూ.6,000 గౌరవవేతనం ఇచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమం స్థానంలో పడో-పడావో కార్యక్రమం చేపట్టడానికి కేంద్రం రంగం సిద్ధం చేసిందని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వమేనంటూ బీజేపీ నేతలు విష్ణు కుమార్ రాజు, విష్ణువర్ధన రెడ్డి లు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ‘సాక్షర భారత్’ కు చెందిన 21 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించినట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు.

కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడం ద్వారా మధ్యప్రదేశ్ లో గత అక్టోబర్ లో 20 వేల మందిని, గుజరాత్ లో 22 వేల మందిని, రాజస్థాన్ లో 20 వేల మందిని, ఛత్తీస్ గడ్ లో కూడా వేల మందిని తొలగించారని, దేశం మొత్తం మీద లక్ష మంది వరకు తొలగించారని జూపూడి వివరించారు. రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథారిటీ వద్ద ఉన్న రూ.3.35 కోట్లు, రూ.54.92 లక్షలను తిరిగి ఇచ్చివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ అక్షరాస్యత మిషన్ అథారిటీ ఆదేశించినట్టు తెలిపారు.

రాష్ట్రంలోని వాలంటీర్లను తొలగించకుండా కొనసాగించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు సార్లు కేంద్రానికి విజ్ఙప్తి చేస్తూ లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా జూపూడి ప్రస్తావించారు. దీనిపై కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, వాలంటీర్లను తొలగించకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుందని, ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నారని జూపూడి చెప్పారు.

More Telugu News