Telangana: కంటికి శస్త్ర చికిత్స వాయిదా.. ఈ నెల 26 నుంచి విశాఖ జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ పోరాట యాత్ర

  • మూడు నెలలుగా పవన్‌ను బాధిస్తున్న కంటి సమస్య
  • ఈ నెల 24 న శస్త్ర చికిత్స చేయాలన్న డాక్టర్లు
  • తాజాగా వైద్య పరీక్షలు.. వాయిదా
  • ఉత్తరాంధ్ర మేధావులతో పవన్ సమావేశమయ్యే అవకాశం

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నం జిల్లాలో జనసేన పోరాట యాత్రను ఈ నెల 26 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నారు. తన వెంట వుండే సిబ్బందిలోని ముస్లిం సోదరుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా విశాఖ జిల్లా యాత్రకు విరామం ఇచ్చిన సంగతి విదితమే. అయితే, తనను మూడు నెలలుగా బాధిస్తున్న కంటి సమస్యకు ఈ విరామ కాలంలో చిన్నపాటి శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి యాత్రను ప్రారంభిద్దామనుకున్నారు.

ఈ నెల 24 న శస్త్ర చికిత్స చేయాలని ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్లు నిర్ణయించారు. అయితే, తాజాగా జరిగిన వైద్య పరీక్షలను పరిశీలించిన డాక్టర్లు శస్త్ర చికిత్సకు ఇంకొంత కాలం ఆగాలని సూచించడంతో పోరాట యాత్రను తిరిగి ప్రారంభించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఈ మలివిడత యాత్ర విశాఖ జిల్లాలో మూడు నుంచి నాలుగు రోజులపాటు కొనసాగుతుంది.

జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించడంతో పాటు ఉత్తరాంధ్ర మేధావులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యే అవకాశం వుంది. విశాఖ జిల్లా అనంతరం పోరాట యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభం అవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో పోరాట యాత్ర సన్నాహాలలో ఆ జిల్లా జనసేన నేతలు నిమగ్నమై వున్నారు.

More Telugu News