Tirumala: పురాతన తాళపత్ర గ్రంథాల్లో వెంకటేశ్వర స్వామి అమూల్య నిధుల వివరాలు.. విశదీకరించిన రమణ దీక్షితులు!

  • స్వామివారి ఆభరణాల గురించి తెలుసుకుంటే చిత్త భ్రమ
  • 100 ఏనుగులు, 30 వేల అశ్వాలపై ఆభరణాలు తెచ్చిన తిరుమలరాయలు
  • 18 లక్షల మొహరీలతో ప్రతాపరుద్రుని 'రత్నాంగిణి' కవచం
  • తొలి ప్రాకారంలో భద్రపరచబడిన అపార సంపద

కోట్లాది మంది భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న తిరుమల శ్రీనివాసుడు అపారమైన మహిమలున్న దైవమని, ఆయన గురించి పురాతన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న వివరాలు తెలుసుకుంటే భక్తులకు చిత్త భ్రమ కలుగుతుందని ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు వెల్లడించారు.

ఈ ఉదయం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, "కృష్ణదేవరాయలవారి తరువాత మూడవ మహారాజుగా విజయనగర సామ్రాజ్యాధిపతిగా తిరుమలరాయల వారు వచ్చారు. వారు సుమారు 1000 ఏనుగులు, 30 వేల అశ్వాలపై అమూల్యమైన సంపదను... వారికి యుద్ధ విజయాల్లో ప్రాప్తించిన సంపదనంతా తిరుమలకు తీసుకు వచ్చి ఎక్కడో నిక్షిప్తం చేశారని మనకు శాస్త్రాల్లో తెలుస్తోంది.

కానీ, కలియుగంలో పోనుపోను మనుషుల్లో తీవ్రమైన దురాశ కలుగుతుందని వారికి దైవమంటే భయంగానీ, భక్తిగానీ ఉండదని తెలుసుకుని, ఆ సంపదనంతా కొన్ని కీలకమైన ప్రదేశాల్లో సామాన్య మానవుల యొక్క మేధస్సుకు అందరాని విధంగా నిక్షిప్తం చేశారని చెప్పబడివుంది" అన్నారు.

"1800వ సంవత్సరం సమయంలో ఆర్కాట్ కలెక్టరుగా ఉన్న ఒక ఆంగ్లేయుడు తిరుమలకు వచ్చి, తిరుమల దేవాలయంలో జరిగే అన్ని కార్యక్రమాలనూ సవివరంగా సమీక్షించారు. అర్చకులు, పరిచారకులు అదే విధంగా స్వామివారి దేవాలయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అనేకమైన వృత్తులవారు... కుమ్మరి వాళ్లు, దొమ్మరి వాళ్లు, ముగ్గులు వేసేవారు, అరటిమానులు కట్టేవారు, ఏనుగులను చూసుకునేవారు, అశ్వాలను చూసుకునేవారు, స్వామివారి వాహనాలను మోసేవారు, స్వామివారి ఆలయాన్ని కాపాడేవాళ్లు... వీరందరినీ పిలిపించి, వారి కర్తవ్యాలు, వారు చేసే సేవలు, అందుకు ఫలితంగా వారికి లభించే వరుంబడి... వీటన్నింటినీ కూడా ప్రశ్నోత్తరాలుగా క్రోఢీకరించి... 'సవాల్ జవాబ్ పట్టీ' అనే దాన్ని తయారు చేశారు. అది మనకు ఇప్పటికీ ప్రామాణికమైన గ్రంథంగా ఉంది. అందులో ఈ స్వామివారి కైంకర్యాలు, వాటి ప్రాముఖ్యతను వివరించిన తరువాత ఒకచోట... స్వామివారికి ఉన్న తిరువాభరణాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

స్వామివారిని 1000 కోట్ల దేవుడని పిలిచేవారని, ముఖ్యంగా ప్రతాపరుద్రుడనే కాకతీయ మహారాజు... ఇక్కడి వరంగల్ కోటను స్థాపించి, సుమారు 50 సంవత్సరాలు పాలించిన అతి ప్రముఖుడైన చక్రవర్తి. ఆయన స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, 18 లక్షల బంగారు మొహరీలు ఉపయోగించి, మూలవరులకు... అంటే సుమారు తొమ్మిదిన్నర అడుగుల ఎత్తైన మూలవరులకు నవరత్న కవచం... 'రత్నాంగిణి' అనే పేరుతో సమర్పించినట్టు, తరువాత అదే సందర్భంలో 18 లక్షల బంగారు మొహర్లు... ఒకటి సుమారు 100 గ్రాములు ఉంటుంది.

వాటితో స్వామివారికి కనకాభిషేకం నిర్వహించి, ఇంకా ఎన్నో అమూల్యమైన నవరత్నాలను, బంగారు విగ్రహాలను స్వామివారి దేవాలయం మొదటి ప్రాకారంలో ఓ నేలమాళిగలో ఉంచారు... ఆ నేలమాళిగ కొలతలు కూడా అందులో చెప్పారు. ఆ నేలమాళిగలో భద్రపరిచి, పైన తలుపులు వేసి మూసిన తరువాత, దానిపై బండలు పరిచారని, అది సామాన్య భక్తులు ప్రవేశించలేని విధంగా ఉంటుందని వివరంగా చెప్పబడింది" అని రమణ దీక్షితులు వెల్లడించారు.

అంతకన్నా ముందు పల్లవులు, చోళులు తదితర చక్రవర్తులు, వారి సామంతరాజులు ఇచ్చిన అమూల్యమైన ఆభరణాలను కూడా మొదటి ప్రాకారంలో దాచారని తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయన్నారు. తొలి ప్రాకారంలో భక్తులు వెళ్లలేని ప్రదేశాలు రెండున్నాయని, వాటిల్లో ఒకటి స్వామి గర్భాలయం అయితే, రెండోది యాగశాలని తెలిపారు. ప్రతి నిత్యమూ ఉదయం తరువాత దాన్ని మూసివేస్తారని వెల్లడించిన రమణ దీక్షితులు, దాని పక్కనే దక్షిణ ఆగ్నేయంలో కట్టబడిన స్వామివారి వంటశాల ఉందని, దీనిలోకి వంటవారు, అర్చకులు మినహా మరెవరూ వెళ్లేందుకు వీల్లేదని చెప్పారు. ఎటునుంచి చూసినా, ఇతరులకు ప్రవేశం లేని వంటశాలలోనే నేలమాళిగలకు దారి ఉందన్న విషయం తేటతెల్లమవుతుందని అన్నారు.

2017 డిసెంబర్ 8న స్వామివారి లోపలి పోటును మూసేశారని, ఆ విషయం తనకు తెలిసి విచారించానని రమణ దీక్షితులు అన్నారు. లోపల నాలుగు రాతి బండలు పగిలాయని, కొద్ది రోజులు పోటు మూసివేశామని జేఈఓ శ్రీనివాసరాజు చెప్పినట్టు పేపర్లలో వచ్చిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, స్వామి ప్రధానార్చకుడిగా, వైఖానస ఆగమ శాస్త్ర సలహాదారుగా ఉన్న తనకు, మరో ముగ్గురు ప్రధానార్చకులకు తెలియకుండానే పోటు మూసివేయడం ఎలా జరిగింది? ఆ సమయంలో అన్న ప్రసాదాలు ఎక్కడ తయారు చేశారు? తదితర విషయాలు తెలియదని చెప్పారు. ఎవరి సలహా తీసుకుని ఈ పని చేశారో తెలియదని అన్నారు. స్వామి నిధుల కోసమే తవ్వకాలు జరిపారన్న తన ఆరోపణలపై సమాధానం చెప్పాలని నిలదీశారు. జరుగుతున్న తప్పులను ఎత్తి చూపినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగారని అన్నారు.

More Telugu News