Kadapa District: ఆమరణ దీక్షకు కదిలిన తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్

  • 'ఉక్కు దీక్ష' పేరిట సభాస్థలి
  • వైకాపా ఎంపీల మాదిరిగా దొంగదీక్ష చేయబోను
  • మీడియాతో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్

కడప జిల్లాలో వెంటనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. ఆయన చేస్తున్న దీక్షకు 'ఉక్కు దీక్ష' అని పేరు పెట్టిన టీడీపీ శ్రేణులు, దీక్షా వేదికను ఇప్పటికే సిద్ధం చేయగా, మరికాసేపట్లో రమేష్ వేదిక వద్దకు చేరుకోనున్నారు.

 స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో సీఎం రమేష్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల నివేదికను పరిశీలించాలని కూడా ఆయన కోరారు. ప్లాంట్ ను ఏర్పాటు చేయకుంటే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

కాగా, కడపతో పాటు బయ్యారంలో ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసే దిశగా పరిశీలించాలని ఏపీ విభజన చట్టంలో ఉండగా, వాటి ఏర్పాటు సాధ్యంకాదని చెబుతూ సెయిల్ ఇచ్చిన నివేదికతో ఇటీవల ఓ అఫిడవిట్‌ ను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందించగా, ఇరు రాష్ట్రాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇక తన దీక్ష సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, వైకాపా ఎంపీల మాదిరిగా తాను దొంగ దీక్షలకు దిగడం లేదని, ఆమరణ దీక్షకు కూర్చోనున్నానని తెలిపారు.

More Telugu News