america: ఎంతో భావోద్వేగానికి గురి చేస్తున్న ఫొటో ఇది!

  • సరిహద్దులు దాటుతున్న మెక్సికన్లను అడ్డుకుంటున్న అమెరికా 
  • తల్లిదండ్రుల నుంచి పిల్లలను బలవంతంగా వేరు చేస్తున్న వైనం
  • హోండురస్ కు చెందిన రెండేళ్ల బాలిక ఏడుస్తున్న ఫొటో వైరల్

ఒక్కో ఫొటో మనల్ని షేక్ చేస్తుంటుంది. ఎంతటి వారినైనా భావోద్వేగానికి గురి చేస్తుంది. కొన్నేళ్ల క్రితం మెడిటరేనియన్ బీచ్ లో మూడేళ్ల బాలుడు అయ్ లాన్ కుర్ది విగతజీవిగా పడి ఉన్న ఫొటో ప్రపంచాన్ని అలాగే కదిలించి వేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ ఫొటో ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోంది. ఈ ఫొటోలో హోండురస్ కు చెందిన రెండేళ్ల బాలిక ఏడుస్తూ కనిపిస్తోంది. మెక్సికో నుంచి అక్రమంగా సరిహద్దులు దాటుతున్న తల్లిదండ్రులను, వారి పిల్లలను అమెరికా సరిహద్దు దళాలు బలవంతంగా వేరు చేస్తున్న దృశ్యం ఈ ఫొటోలో ఉంది.

కాగా, అమెరికా- మెక్సికో సరిహద్దు విషయంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరికి ఈ ఫొటోనే నిదర్శనమంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విధంగా ఇప్పటికే రెండు వేల మంది పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరమయ్యారు. అమెరికాలోని దక్షిణ సరిహద్దులో అక్రమ వలసలను అడ్డుకునే క్రమంలో చిన్నారులను తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తుండడంపై తీవ్రమైన విమర్శలు తలెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ ఫొటోను తీసింది గెట్టీ ఫొటో గ్రాఫర్, పులిట్జర్ అవార్డు గ్రహీత జాన్ మూర్. ఆ చిన్నారి ఏడుస్తున్న సమయంలో ఆమె తల్లిని పోలీసులు విచారిస్తున్నారు. ఇక్కడ తీసిన ఫొటోలపై జాన్ మూర్ స్పందిస్తూ.. తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని అన్నారు.

More Telugu News