KTR: మిషన్ భగీరథ పనులను ఆగస్టులోగా పూర్తి చేయాలి: కేటీఆర్‌ ఆదేశాలు

  • వర్కింగ్ ఏజెన్సీలకు మంత్రి సూచనలు
  • గడువులోగా పనులు పూర్తి అయ్యేలా చూడాలి
  • బ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలి
  • పురపాలికల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలి

పట్టణాల్లో తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ (అర్బన్) పనులను ఆగస్టులోగా పూర్తి చేయాలని వర్కింగ్ ఏజెన్సీలను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఈ రోజు బేగంపేట మెట్రో రైల్ భవన్‌లో జరిగిన మిషన్ భగీరథ అర్బన్ సమీక్షా సమావేశంలో అధికారులు, వర్కింగ్ ఎజెన్సీలతో ఆయన చర్చించారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో మిషన్ భగీరథ అర్బన్ పనుల పురోగతిని ఈ సందర్భంగా మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటికే చాలా పట్టణాల్లో పనులు వేగంగా నడుస్తున్నాయని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తామని వర్కింగ్ ఏజెన్సీలు చెప్పాయి. వర్షాలు అరంభం అయినా చాలా వరకు సివిల్ నిర్మాణాలు సేఫ్ స్టేజీకి చేరుకున్నాయని, పనుల్లో పెద్దగా అటంకాలు ఉండకపోవచ్చన్నారు. వచ్చే ఆగస్టు నాటికి దాదాపుగా అన్ని పైపులైన్ల నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. దీంతోపాటు వివిధ కారణాలతో ఆలస్యం అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం అక్టోబర్ మాసాంతానికి సివిల్ నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు మంత్రికి తెలిపారు.

వర్షాకాలం నేపథ్యంలో పైపులైన్ల నిర్మాణం కోసం తవ్విన రహదారులను వెంట వెంటనే రిస్టోర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖాధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగాన్ని మరింతగా బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. పెరిగిన మున్సిపాలిటీలు, పట్టణాల్లో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల అవసరాల మేరకు సిబ్బందిని అనుమతించాలని అధికారులు కోరారు.

ఈ సందర్భంగా ఇప్పటి దాకా పట్టణాలకు ఇస్తున్న నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రణాళికల (డీపీఆర్‌)ను సమీక్షించిన కేటీఆర్‌... నెలాఖరు నాటికి టెండర్లు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఈమేరకు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా చర్చించాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ కి అదేశాలు జారీ చేశారు.

ఈ ప్రత్యేక నిధులతో చేపట్టే కార్యక్రమాలను వచ్చే అరు నెలల్లోగా పూర్తి అయ్యేలా గడువును టెండర్లలో పొందుపర్చాలని, గడువులోగా పనులు పూర్తి అయ్యేలా చూడాల్సిన భాధ్యత తీసుకోవాలని చెప్పారు. నూతనంగా ఏర్పడనున్న పురపాలికల్లో అవసరం అయిన కనీస మౌలిక వసతులు, మానవ వనరులను ఇప్పటి నుంచే గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు, ఈఏన్‌సీ(పీహెచ్) దన్ సింగ్ నాయక్, అధికారులు, వర్కింగ్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

More Telugu News