MIM: బీజేపీని నమ్ముకున్నందుకు మెహబూబా ముఫ్తీకి సరైన శాస్తి జరిగింది: అసదుద్దీన్‌ ఓవైసీ

  • జమ్ముకశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ బంధానికి తెరపై స్పందన
  • ఆందోళనకర పరిస్థితులను అదుపుచేయలేకపోయారు
  • తమ తప్పేం లేదన్నట్లు బీజేపీ ప్రవర్తిస్తోంది
  • భారత ఆర్మీ క్యాంపులపై దాడులు జరిగాయి

జమ్ముకశ్మీర్‌లో పీడీపీతో బీజేపీ బంధం తెంచుకోవడంపై హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జమ్ము కశ్మీర్‌లో ఆందోళనకర పరిస్థితులను అదుపుచేయలేకపోవడంలో తమ తప్పేం లేదన్నట్లు బీజేపీ ప్రవర్తిస్తోందని అన్నారు. ఆ రాష్ట్రంలో పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు దారుణంగా విఫలమైందని అన్నారు.

ఉగ్రవాదం, భారత ఆర్మీ క్యాంపులపై దాడులతో పాటు ఇటీవల పత్రికా సంపాదకుడు షుజీత్‌ బుఖారీ లాంటివాళ్ల హత్యలు వంటి ఎన్నో ఘటనలు జరగడానికి, పరిస్థితులు చక్కదిద్దలేకపోవడానికి పీడీపీ కన్నా బీజేపీనే ప్రధాన కారణమని అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. మెహబూబా ముఫ్తీని నిందిస్తే బీజేపీ తప్పులు మాసిపోవని విమర్శించారు. మరోవైపు బీజేపీని నమ్ముకున్నందుకు మెహబూబా ముఫ్తీకి సరైన శాస్తి జరిగిందని అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.      

More Telugu News