buggana: ఎంపీ కనకమేడల, ఎమ్మెల్యే యరపతినేనికి బుగ్గన ప్రివిలేజ్ నోటీసులు

  • వాళ్లిద్దరికీ ప్రివిలేజ్ నోటీసులు జారీ చేశా
  • అమిత్ షాను నేను కలవలేదు
  • నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు

ఢిల్లీలో బీజేపీ నేతలను వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల కలిసిన విషయం, ఆ వెంటనే టీడీపీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు లు కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తనపై ఆరోపణలు చేసిన కనకమేడల రవీంద్ర కుమార్, యరపతినేని శ్రీనివాసరావులకు ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసినట్టు రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను తాను కలవలేదని, తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తనకు మంచి స్నేహితుడని, మిత్రుడిని కలిస్తే తప్పేంటో టీడీపీ నేతలు చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే వారు రాజీనామా చేస్తారా? అని బుగ్గన ప్రశ్నించారు.

More Telugu News