Guntur District: ఆ అక్కాచెల్లెళ్ల అనుబంధాన్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది!

  • చెల్లెలి చేతిలో చెయ్యి వేసి కన్నుమూసిన అక్క
  • తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
  • కన్నీటిపర్యంతమైన గ్రామం

ఇది గుండెలు పిండే విషాదం.. ఇంకా చెప్పాలంటే అంత కంటే కొంచెం ఎక్కువే. చిన్నప్పటి నుంచి ప్రాణప్రదంగా పెరిగిన అక్కాచెల్లెళ్లను 90 ఏళ్ల వయసులో విడదీయడానికి వచ్చిన మృత్యువే కన్నీరు పెట్టుకుంది. ఒకరిని తీసుకెళ్దామని వచ్చిన మృత్యువుకి మరొకరు కూడా తోడయ్యారు. అక్క మరణాన్ని తట్టుకోలేని చెల్లెలు.. నేనూ వస్తున్నా అన్నట్టుగా అక్కవైపు చూస్తూ ప్రాణాలు వదిలింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో జరిగిందీ ఘటన. అక్కాచెల్లెళ్ల మరణంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది.

గ్రామానికి చెందిన కొడాలి సీతారావమ్మ (94)కు ఇద్దరు చెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నారు. సీతారావమ్మకు మేనమామతో వివాహమైంది. ఆమె చిన్న సోదరి చిన్నప్పుడే మృతి చెందింది. మరో సోదరి పావులూరి సత్యవతి (90)కి భర్త చనిపోవడంతో 40 ఏళ్ల నుంచి అక్క దగ్గరే ఉంటోంది. అక్కంటే సత్యవతికి ప్రాణం. తల్లిదండ్రుల తర్వాత అంతగా తనను అక్క ప్రేమిస్తోందని పలుమార్లు చెప్పుకొచ్చింది. కాగా, గత కొన్ని రోజులుగా సీతారావమ్మ అస్వస్థతతో బాధపడుతోంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం చెల్లెలిని చూస్తూ ఆమె చేతిలో చెయ్యి వేసి కన్నుమూసింది. అక్క మృతిని తట్టుకోలేని సత్యవతి కూడా నిమిషం వ్యవధిలోనే కన్ను మూసింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

More Telugu News