Hyderabad: మసాజ్ పేరిట అశ్లీల కార్యకలాపాలు చేయిస్తూ అడ్డంగా దొరికిపోయిన సివిల్స్ ర్యాంకర్!

  • 2016లో సివిల్స్ కి ఎంపికైన సంతోష్ కుమార్
  • క్రిమినల్ కేసు ఉండటంతో ఉద్యోగం దూరం
  • ఆపై మసాజ్ పార్లర్ పెట్టి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు
  • అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

రెండేళ్ల క్రితం సివిల్స్ లో మంచి ర్యాంకు సాధించి, ఇంటర్వ్యూలోనూ ప్రతిభ కనబరిచి, ఓ క్రిమినల్ కేసున్న కారణంగా 'విత్ హెల్డ్'లో ఉండిపోయిన గరిక సంతోష్ కుమార్ అనే యువకుడు, మసాజ్ సెంటర్ ను ప్రారంభించి, 'క్రాస్ మసాజ్' (ఆడవారికి మగవారితో, మగవారికి ఆడవారితో) చేయిస్తూ అడ్డంగా దొరికిపోయాడు.

టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, విశాఖకు చెందిన సంతోష్, ఎమ్మెస్సీ పూర్తి చేసి, సివిల్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చి, నారాయణగూడలోని వైఎంసీఏలో మరో వ్యక్తితో కలసి సెలూన్ నిర్వహించాడు. ఆ సమయంలో భాగస్వామితో వివాదం రావడంతో, అతని భార్యపై దాడి చేయగా, ఆ కేసులో అరెస్టయ్యాడు కూడా. ఆపై తన తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు పూర్తి చేసినా కేసు కారణంగా ఉద్యోగం రాలేదు.

ఈ క్రమంలో కేసు నుంచి నిర్దోషిగా బయటపడే ప్రయత్నం చేయకుండా, తన బంధువైన రాధారెడ్డి సాయంతో సెలూన్ ను స్పాగా మార్చాడు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ముగ్గురు అమ్మాయిలను నియమించి, వారితో మసాజ్ చేయిస్తూ, వారికి వేతనాలు కూడా ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండలం టాస్క్ ఫోర్స్ సిబ్బంది, సంతోష్, ముగ్గురు యువతులు సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను నారాయణగూడ పోలీసులకు అప్పగించామని, కేసును విచారిస్తున్నామని అన్నారు.

More Telugu News