Tollywood: సినిమాల్లో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల.. మణికంఠ సాయి కోసం పోలీసుల వేట!

  • అగ్ర దర్శకుడి పీఏనని చెప్పుకున్న మణికంఠ సాయి
  • ఫిల్మ్ నగర్ లో నిందితుడి బారినపడ్డ అమ్మాయిలు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు

తాను అగ్ర దర్శకుడికి పీఏనంటూ పరిచయాలు పెంచుకుని, హీరోయిన్లుగా అవకాశాలు ఇప్పిస్తానని చెబుతూ, యువతులను మోసం చేస్తున్న మణికంఠసాయి (25) అనే యువకుడి కోసం పోలీసులు ఇప్పుడు వెతుకుతున్నారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని 354 (ఎ), 497, 509 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తనకు బ్యాంకు రుణం ఇప్పిస్తానంటూ రూ. 60 వేలు తీసుకున్నాడని, తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ, కీర్తిపల్లి సత్యనారాయణ శర్మ అనే వ్యక్తి ఫిల్మ్ నగర్ లో నివాసముంటున్న మణికంఠపై ఫిర్యాదు ఇవ్వడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.

తన భార్య అతనితో ఉన్న సమయంలో ఫొటోలు తీసి, వాటిని ఇంటర్నెట్ లో పెడతానని అతను బెదిరించాడని సత్యనారాయణ ఫిర్యాదు చేశాడు. సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని ఎంతోమంది స్థానిక అమ్మాయిలను మోసం చేశాడని, అందినంత డబ్బు దోచుకుంటూ, తన కోరికను తీర్చుకుంటున్నాడని ఆరోపించాడు. బాధితులకు తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు బంజారాహిల్స్ పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News