Vijayawada: విజయవాడ దుర్గగుడిలో తప్పిపోయిన చిన్నారి ఆచూకీ లభ్యం!

  • క్యూలో తప్పిపోయిన చిన్నారి
  • పనిచేయని ఆలయంలోని సీసీ కెమెరాలు
  • నరసరావుపేట పోలీసుల వద్ద చిన్నారి

విజయవాడ దుర్గగుడిలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి ఆచూకీ లభ్యమైంది. విజయవాడ బస్టాండ్‌లో ఏడుస్తూ కనిపించిన చిన్నారిని కొందరు వ్యక్తులు నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. ఆదివారం దుర్గ గుడిలో అమ్మవారి దర్శనం కోసం ఓ కుటుంబం క్యూలో నిల్చున్నప్పుడు నాలుగేళ్ల వారి కుమార్తె తప్పిపోయింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆలయ అధికారులను సంప్రదించారు.

ఆలయంలోని సీసీ కెమెరాల ద్వారా చిన్నారి ఆచూకీని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నించగా అవి పనిచేయలేదు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. చిన్నారి కోసం పోలీసులు గాలిస్తుండగానే కొందరు వ్యక్తులు ఆమెను తీసుకొచ్చి నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. విజయవాడ బస్టాండ్‌లో పాప ఒంటరిగా ఏడుస్తూ కనిపించడంతో తాము తీసుకొచ్చామని చెప్పారు. అయితే, పాపను తీసుకొచ్చిన వ్యక్తులను అనుమానించిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.

More Telugu News