Niti aayog: తొలి చాన్స్ చంద్రబాబుదే... మోదీని కడిగేసిన ఏపీ సీఎం!

  • ఢిల్లీలో నీతి ఆయోగ్ నాలుగో సమావేశం
  • తన ప్రసంగంలో కేంద్రంపై చంద్రబాబు విమర్శలు
  • పలు డిమాండ్లను కేంద్రం ముందుంచిన చంద్రబాబు

ఈ ఉదయం న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ నాలుగో పాలకమండలి సమావేశం జరుగగా, 2022 నాటికి దేశాభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేయగా, ఆపై ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. మోదీ ప్రసంగం తరువాత ఆంగ్ల వర్ణమాల క్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎంకు తొలుత మాట్లాడే అవకాశం లభించింది. తమ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగడం లేదని, కేంద్రం రాష్ట్రాభివృద్ధికి ఏ మాత్రం సహకరించడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో సేవారంగం విస్తరిస్తోందని, సేవారంగం వృద్ధిని పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిందని మరోసారి గుర్తు చేసిన ఆయన, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చడం లేదని, అసలు హామీలు నెరవేర్చే ఉద్దేశం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చకుంటే, ప్రజలు కేంద్రంపై విశ్వాసాన్ని కోల్పోతారని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి నిధులు సమకూర్చాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

పోలవరం బాధితుల పునరావాసానికి కావాల్సిన నిధులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. అమరావతి నిర్మాణానికి నిధులు ఆగిపోయాయని, తాము లెక్కలు చెబుతున్నా, లెక్కలు చెప్పడం లేదని ఆరోపించడం ఎంతవరకూ సబబని చంద్రబాబు ప్రశ్నించారు. రెవెన్యూ లోటు విషయంలో గతంలో ఇచ్చిన హామీని విస్మరించారని నిప్పులు చెరిగిన ఆయన, గతంలో ఇచ్చిన అన్ని హామీలనూ అమలు చేయాలని అన్నారు.

More Telugu News