Hyderabad: అక్క బాధ చూడలేకనే చిన్నారులను చంపేశానన్న నిందితుడు!

  • అక్క పడుతున్న బాధలు, ఆర్థిక సమస్యలు చూడలేకపోయాడట
  • రూమ్ మేట్ వెంకట్రామిరెడ్డి సాయం తీసుకున్నాడు
  • పోలీసుల విచారణలో నిందితుడు మల్లికార్జునరెడ్డి వెల్లడి

హైదరాబాద్ లోని చైతన్యపురిలో మానసికంగా ఎదగని కవల పిల్లలను హతమార్చిన సంఘటన గురించి ఆశ్చర్యకర విషయాలు బయటకొస్తున్నాయి. ఆ పిల్లలను హతమార్చిన నిందితుడు, వారి మేనమామ మల్లికార్జునరెడ్డిని పోలీసులు విచారించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో తన అక్క లక్ష్మి పడుతున్న బాధలు, ఆర్థిక సమస్యలు చూడలేకనే ఆ ఇద్దరిని తాను చంపేశానని మల్లికార్జునరెడ్డి చెప్పినట్టు సమాచారం. తన రూమ్ మేట్ వెంకట్రామిరెడ్డి సాయంతో ఈ హత్య చేశానని చెప్పాడు.

కాగా, తమ పిల్లలను హత్య చేసిన సమాచారం తెలిసిన అనంతరం, చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు వారి తల్లిదండ్రులు లక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. ఈ హత్య వెనుక ఎలాంటి కుట్రలేదని, తన బావ మరిదితో తమకు ఎలాంటి గొడవలు లేవని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తన తమ్ముడు మల్లికార్జునరెడ్డిపై కేసు పెట్టేందుకు లక్ష్మి నిరాకరించడం, పైగా జరిగిందేదో జరిగిపోయిందంటూ ఆమె వ్యాఖ్యానించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీంతో ఈ హత్య విషయం వీళ్లిద్దరికీ ముందే తెలుసేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా, మల్లికార్జునరెడ్డికి సాయపడ్డ వెంకట్రామిరెడ్డిని, మృతదేహాలను తరలించేందుకు ఉపయోగించిన కారు డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

More Telugu News