taj mahal: తాజ్ మహల్ ను దత్తత ఇవ్వాలన్న ఆలోచనపై కేంద్రం వెనుకడుగు!

  • ఇప్పటికిప్పుడు దత్తత అవసరం లేదని కమిటీ భావన
  • పరిష్కరించాల్సిన అంశాలున్నాయని ఓ అధికారి వెల్లడి
  • కట్టడం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు

ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్ కట్టడాన్ని దత్తతకు ఇచ్చే ఆలోచనపై కేంద్రం వెనుకడుగు వేసినట్టు కనిపిస్తోంది. ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ అనే కార్యక్రమం కింద ప్రముఖ కట్టడాలను దత్తత కిచ్చే కార్యక్రమానికి కేంద్రం ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కింద దత్తతకు ఇవ్వదగిన 100 చారిత్రక కట్టడాలను గుర్తించింది. ఇప్పటికే కుతుబ్ మినార్ ను యాత్రా డాట్ కామ్ సంస్థకు, సఫ్దర్ జంగ్ టూమ్ ను ట్రావెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు, జంతర్ మంతర్ ను ఎస్బీఐ ఫౌండేషన్ కు, రెడ్ ఫోర్ట్ ను దాల్మియా భారత్ లిమిటెడ్ కు, కోణార్క్ లోని సన్ టెంపుల్ ను టీకే ఇంటర్నేషనల్ కంపెనీలకు దత్తత ఇవ్వడం జరిగింది.

తాజ్ మహల్ దత్తత అంశంపై తాము దృష్టి పెట్టలేదని, తాజ్ మహల్ సహా కొన్ని ఇప్పటికిప్పుడు దత్తతకు ఇవ్వాల్సిన అవసరం లేదని దత్తత కోసం ఏర్పాటైన కమిటీ తేల్చేసింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ సంపదలో భాగమైన తాజ్ మహల్ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోవడంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు తలంటిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పలు అంశాలను పరిష్కరించాల్సి ఉందని ఓ అధికారి పేర్కొన్నారు.

More Telugu News