Chandrababu: చంద్రబాబుని వ్యతిరేకించే అన్ని రాజకీయపార్టీలు ఏకం కావాలి: మోత్కుపల్లి

  • చంద్రబాబు కొడుకు రాజకీయ వ్యాపారం పెట్టారు
  • నందమూరి కుటుంబంలో ఎవరికి న్యాయం చేశారు? 
  • తన కొడుక్కి, మనవడికీ  రాజ్యాధికారం కావాలని బాబు  కోరుకుంటున్నారు

చంద్రబాబు కొడుకు రాజకీయ వ్యాపారం పెట్టారని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘రాజకీయాలను వ్యాపారం చేసిన ఘనత ఒక్క చంద్రబాబునాయుడిదే. ఒక దళితుడిగా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. దగ్గుబాటి వెంకటేశ్వరావు, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ముఖ్యమంత్రి కావాల్సిన బాలకృష్ణను నువ్వు ( చంద్రబాబునాయుడు) మోసం చేశావు, నందమూరి కుటుంబంలో ఎవరికి నువ్వు న్యాయం చేశావు? వాళ్లందరూ నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. 

నీ కొడుకు, మనవడికీ కూడా రాజ్యాధికారం కావాలని నువ్వు కోరుకోవడం ఎంత వరకు సమంజసం? నందమూరి కుటుంబం కోసం ఏదైనా చేస్తాం. ఇప్పటికైనా సరే, నందమూరి కుటుంబంలో ఎవరైనా ‘ఈ జెండా మాది’ అని ముందుకొస్తే వాళ్ల వెంబడే తిరుగుతా. చదువుకున్న వాళ్లకు ఎన్టీఆర్ టిక్కెట్ ఇచ్చారు. నువ్వు.. డబ్బున్నవాళ్లకు టిక్కెట్ ఇస్తున్నావు. పేదోడికి ఎన్టీఆర్ టిక్కెట్ ఇచ్చాడు. నువ్వు..  ఘోరమైన పాపాలు చేసిన వాళ్లకి ఇస్తున్నావు. ఒక దళితుడిగా నేను కోరేదేమిటంటే.. చంద్రబాబునాయుడిని వ్యతిరేకించే అన్ని రాజకీయపార్టీలు ఏకం కావాలని పిలుపు ఇస్తున్నా. 2019లో చంద్రబాబు నాయుడికి ప్రజలు తగినబుద్ధి చెబుతారు’ అన్నారు. 

More Telugu News