Chandrababu: చంద్రబాబు సంపాదించినదంతా విదేశాల్లో దాస్తున్నారు: మోత్కుపల్లి

  • చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలి
  • కచ్చితంగా ఎంత సంపాదించారో బయటకొస్తుంది
  • రాజ్యసభ సీట్లను అమ్ముకుంటావా?

చంద్రబాబు నాయుడు సంపాదించినదంతా విదేశాల్లో దాస్తున్నారంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘చంద్రబాబునాయుడు సంపాదించినదంతా దుబాయ్, సింగపూర్, అమెరికాలో దాస్తున్నారు. చంద్రబాబునాయుడు సంపాదించిన ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలి. ఒకవేళ దొరికినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవచ్చు. నీకు దమ్మూధైర్యం ఉంటే.. ఆ స్టేలన్నింటినీ వెకేట్ చేయించుకో.

నువ్వు(చంద్రబాబు) ఓపెన్ గా ముందుకు రావాలి. చంద్రబాబుపై సీబీఐ ఎంక్వయిరీ కనుక జరిపితే కచ్చితంగా ఎంత సంపాదించారో బయటకొస్తుంది. రాజ్యసభ సీట్లను అమ్ముకుంటావా? రాజ్యసభ సీటు ఇస్తానని నువ్వు నాకు ప్రామిస్ చేయలేదా? ఈ సీటును టీజీ వెంకటేష్ కు వంద కోట్లకు నువ్వు అమ్ముకోలేదూ? సీఎం రమేష్ దగ్గర నువ్వు తీసుకున్నావా? లేదా? గరికపాటి మోహన్ రావుకు నువ్వు డబ్బులు తీసుకోకుండా ఇచ్చావా? నేను వాళ్లను తప్పుబట్టడం లేదు. నువ్వు వేలం వేశావు.. వాళ్లు కొన్నారు. వేలం వేస్తామని బోర్డు పెడితే కొనుక్కోకుండా ఎవరుంటారు? తప్పెవరిది.. లీడర్ ది. రాజ్యసభలో ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఉండకూడదా?’ అని మోత్కుపల్లి ప్రశ్నల వర్షం కురిపించారు.

More Telugu News