Rajasthan: మమ్మల్ని ఎలుకలతో పోల్చిన మంత్రి ముక్కూ చెవులు కోసేస్తాం!: రాజస్థాన్ లో కర్ణి సేన హెచ్చరిక

  • ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి
  • కొంతమంది రంధ్రాల్లో నుంచి ఎలుకల్లా బయటకు వస్తారు
  • ఈ వ్యాఖ్యలపై కర్ణి సేన వర్గం ప్రజల అభ్యంతరం

రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి కిరణ్ మహేశ్వరిపై కర్ణి సేన మండిపడుతోంది. తమను ఎలుకలతో పోల్చిన మంత్రిపై నిప్పులు చెరుగుతున్నారు. కర్ణి సేన వర్గంకు చెందిన ప్రజలకు మంత్రి తక్షణం క్షమాపణలు చెప్పకపోతే ఆమె ముక్కూ చెవులు కోసేస్తామని హెచ్చరించింది.

రాజస్థాన్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సర్వ్ రాజ్ పుత్ సమాజ్ సంఘర్ష్ సమితి ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంపై మంత్రి మహేశ్వరి విమర్శలు గుప్పించే క్రమంలో ఓ వ్యాఖ్య చేశారు. ‘ఇక్కడ కొంతమంది ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రంధ్రాల్లో నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్టుగా వస్తారు’ అంటూ వ్యాఖ్యానించారు.

 ఈ వ్యాఖ్యలను ఆ వర్గానికి చెందిన కర్ణిసేన తప్పుబట్టింది. అయితే, దీనిపై సదరు మంత్రి స్పందిస్తూ, కర్ణిసేన వర్గ ప్రజలను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని.. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేశానని చెప్పారు. దీంతో, ఆమెకు మరో తలనొప్పి వచ్చి పడింది. మా పార్టీని విమర్శిస్తారా? అంటూ రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, రాజస్థాన్ లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ పుత్ ఓట్ల సాయంతో మహేశ్వరి విజయం సాధించారు.

More Telugu News