kanna lakshminarayana: కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయమని కేంద్రం ఎక్కడా చెప్పలేదు!: కన్నా లక్ష్మీనారాయణ

  • కేంద్రం ఇచ్చిన ఆర్డర్ లో ప్లాంట్ సాధ్యపడదు అని ఎక్కడా లేదు
  • ప్లాంట్ సాధ్యం కాదని గతంలో సెయిల్ నివేదిక ఇచ్చింది
  • స్టీల్ ప్లాంట్ ను తీసుకొచ్చే బాధ్యత కేంద్రానిదే

కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. కేంద్రం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో ఇది వివరంగా వుందని చెప్పారు. జిల్లాలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని సెయిల్ 2014లో నివేదిక ఇచ్చిందని, అయినప్పటికీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వం, మెకాన్ సంస్థలు కలసి దీనిపై నివేదిక అందజేస్తే... త్వరలోనే ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని కన్నా చెప్పారు.

ఈ విషయంలో అమిత్ షా చొరవతో మరోసారి పరిశీలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలలో ప్లాంట్ సాధ్యపడదు అని ఎక్కడా లేదని, అయితే టీడీపీ నాయకులు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మోస పూరిత చర్యలతో ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారని కన్నా మండిపడ్డారు. టీడీపీ నేతలు నాటకాలు ఆపాలని సూచించారు.

 'స్టీల్ ప్లాంట్ కోసం ఒకాయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటాడు. మరొకాయన మరొకటి అంటాడు. ఏమైనా టీడీపీ నేతలు ఎవరూ ప్రాణ త్యాగం చేయాల్సిన అవసరం మాత్రం లేదు. కడపకు స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే' అని చెప్పారు.

More Telugu News