New Delhi: నరేంద్ర మోదీ నివాసం వద్ద కాసేపు ఎగిరి వెళ్లిన యూఎఫ్ఓ... ఏదీ బయటకు చెప్పలేమంటున్న పోలీసులు!

  • లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ఎగురుతూ వెళ్లిన వస్తువు
  • అదేంటో తెలియలేదని ఢిల్లీ పోలీసులకు సెక్యూరిటీ స్టాఫ్ రిపోర్ట్
  • భద్రతా కారణాల దృష్ట్యా ఏమీ చెప్పలేమన్న ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్

న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసమున్న లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ఆకాశంలో ఎగిరే పళ్లెంలాంటి ఓ యూఎఫ్ఓ (అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్) ఎగురుతూ వెళ్లిందట. ఈ నెల 7వ తేదీన ఈ ఘటన జరుగగా, గుర్తు తెలియని వస్తువు ఒకటి ఎగరడాన్ని తాము గమనించామని ప్రధాని భద్రతను పర్యవేక్షించే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేశామని, దాని గురించిన సమాచారం మాత్రం లభ్యం కాలేదని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన నివేదికలో భద్రతా అధికారులు పేర్కొన్నారు.

ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్, భద్రతా కారణాల దృష్ట్యా అది ఏంటన్న విషయాన్ని బయటకు చెప్పలేమని వ్యాఖ్యానించారు. ప్రధాని నివాసం వద్ద గుర్తు తెలియని ఓ వస్తువు ఆకాశంలో చక్కర్లు కొట్టిన మాట మాత్రం నిజమేనని, ఆపై క్షుణ్ణంగా తనిఖీలు చేశామని, ప్రమాదకరమైనవేవీ తమ దృష్టికి రాలేదని అన్నారు.

ఇదిలావుండగా, గత సంవత్సరం సెప్టెంబర్ 17న రాత్రి సమయంలో పార్లమెంట్ చుట్టూ ఓ గుర్తు తెలియని డ్రోన్ వంటి ఆకారం చక్కర్లు కొడుతోందని పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం వచ్చిందన్న సంగతి తెలిసిందే. అయితే, రాడార్లలో దీని జాడ ఏమీ కనిపించలేదని ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెల్లడించింది.

More Telugu News