Biryani: బిర్యానీలో లెగ్‌పీస్‌ ఇవ్వలేదని దుర్మార్గం.. యజమాని చేతి వేళ్లు నరికేసిన కస్టమర్!

  • తమిళనాడులోని తిరునల్వేలిలో ఘటన
  • దంపతుల చేతివేళ్లు కోసేసి పరారీ
  • పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

బిర్యానీలో లెగ్‌పీస్ ఇవ్వలేదన్న కారణంతో హోటల్ యజమాని చేతివేళ్లు నరికేసిన దారుణ సంఘటన తమిళనాడులోని తిరునల్వేలిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జాకీర్ హుస్సేన్-భాను దంపతులు సుద్దమల్లిలో బిర్యానీ సెంటర్ నడుపుతున్నారు. మంగళవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న ఏడుగురు వ్యక్తులు హోటల్‌కు వచ్చి బిర్యానీ ఆర్డర్ చేశారు.

వీరికి సరఫరా చేసిన బిర్యానీలో లెగ్‌పీస్ లేకపోవడంతో హోటల్  యజమాని అయిన జాకీర్ హుస్సేన్‌తో గొడవపడ్డారు. అది కాస్తా ముదరడంతో తమ వద్ద ఉన్న కత్తులు తీసి దంపతులపై దాడికి పాల్పడ్డారు. కత్తులతో వీరంగమేస్తూ వారి చేతి వేళ్లు నరికేశారు. గొడవ విని ఇరుగుపొరుగువారు రావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుద్దమల్లికి చెందిన శబరి (27), సుడలైముత్తు (26)లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించడంతో స్థానిక వ్యాపారులు బుధవారం దుకాణాలు మూసేసి బంద్ నిర్వహించారు. రౌడీల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.

More Telugu News