APTDC: ఏపీ టూరిజం శాఖ ఆఫర్... ఈ బస్సెక్కి వెళితే, గంటన్నరలో తిరుమల శ్రీవారి దర్శనం!

  • విశాఖ నుంచి ఏపీటీడీసీ ప్యాకేజ్
  • మూడు రోజుల యాత్రకు రూ. 4 వేలు
  • నెలాఖరు నుంచి ప్రారంభం

తిరుమల వెంకన్నను దర్శించుకోవాలన్న కోరికతో, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వెళ్లి, గదులు దొరకక, గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూసే లక్షలాది మంది భక్తులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న ఏపీటీడీసీ బస్సు ఎక్కితే, గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే స్వామివారి దర్శనం చేయిస్తామని స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా విశాఖపట్నం నుంచి తిరుమలకు ఈ ప్యాకేజీ ఉంటుందని, అత్యాధునికమైన ఈ బస్సును నడిపేందుకు బెంగళూరులో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. తిరుపతి, విశాఖ డిపోలకు బస్సులను కేటాయిస్తున్నామని వెల్లడించారు.

కాగా, ప్రభుత్వ సంస్థ కావడంతో, ఈ బస్సులో వెళ్లే యాత్రికులకు సులువుగా దర్శన ఏర్పాట్లు చేయించేందుకు టీటీడీ అధికారులతో టూరిజం శాఖ అధికారులు ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. ఇక 43 సీట్లుండే ఈ బస్సులో ఎక్కాలంటే ఒక్కొక్కరికీ రూ. 4 వేల వరకూ వసూలు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖలో బయలుదేరే బస్సు మరుసటి రోజు ఉదయం తిరుపతికి వెళుతుంది. తిరుపతిలోనే యాత్రికులకు వసతి సౌకర్యం కల్పించి, ఆపై అక్కడి నుంచి మరో ఆర్టీసీ బస్సులో తిరుమలకు తీసుకెళ్లి దర్శనం చేయించి కిందకు తీసుకు వస్తారు. అదే రోజు మధ్యాహ్నం తిరిగి బయలుదేరే బస్సు శ్రీకాళహస్తిలో దర్శనం తరువాత, మరుసటి రోజు విశాఖ చేరుతుంది.

More Telugu News